పీకల్లోతు అప్పుల్లో బిజెపి రాష్ట్రాలు

386
- Advertisement -
  • హద్దులు ದಾಟಿ అప్పుల చేసిన 10 రాష్ట్రాలు
  • ఆ పదిలో తెలంగాణ లేదు
  • ఆ పది రాష్ట్రాల్లో ఆర్ధిక నిర్వహణ అధ్వాన్షం
  • అప్పుల్లో అగ్రస్థానంలో పంజాబ్ 53.3%
  • చివరి స్థానంలో అస్సాం 14%
  • 5 రాష్ట్రాల్లో ప్రమాద ఘంటికలు
  • అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్
  • హద్దులు దాటిన ఉచితాలు, సబ్సిడీలు

కమలం పార్టీ గొప్పగా చెప్పుకొంటున్న డబుల్ ఇంజన్ రాష్ట్రాల అభివృద్ధి అంతా అబద్దమేనని మరోసారి స్పష్టమయ్యింది. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఊదరగొట్టిన బిజెపి అగ్రనేతల మాటల్లో పసలేనదని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్.బి.ఐ) నివేదికలు స్పష్టంచేశాయి. బిజెపి పాలిత రాష్ట్రాలతో పాటుగా ఆ పార్టీ పరోక్షంగా పెత్తనం చేస్తున్న మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్ధిక పరిస్థితి దయనీయంగా మారిపోయిందని ఆర్.బి.ఐ. అధ్యయనాలు పేర్కొన్నాయి.

కమలం పార్టీ పాలనలో ఉన్న 17 రాష్ట్రాల్లో అస్సాం, మహారాష్ట్రలు మినహా మిగతా 15 రాష్ట్రాలూ, ఒక కేంద్రపాలిత ప్రాంతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాయి. సబ్సిడీలు, ఉచిత పథకాలు రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలను దెబ్బతీస్తున్నాయని విమర్శించిన కేంద్ర ప్రభుత్వ పెద్దలు గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్ణాటక తదితర రాష్ట్రాల జి.డి.పి.లో నిబంధనలకు విరుద్ధంగా 10 శాతానికి పైగా ఉచితాలు, సబ్సిడీలు అమలు చేస్తూనే ఉన్నారు. అంతేగాక బిజెపి సంపూర్ణంగా సహకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచితాలు, సబ్సిడీలు శక్తికి మించి ఇస్తుండటంతోనే ఆ రాష్ట్రం ఆర్ధికంగా దివాళా తీసిందని కూడా ఆర్.బి.ఐ. తన నివేదికలో పేర్కొంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో జి.డి.పి.లో ఈ సంక్షేమ పథకాలకు పెడుతున్న ఖర్చంతా 10 శాతానికి లోబడే ఉన్నాయని ఆర్.బి.ఐ. నివేదిక స్పష్టంచేసిందని ఆర్ధికశాఖలోని కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

అప్పులు చేసిన రాష్ట్రాల్లో పంజాబ్ 53.3 శాతంతో దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కెల్లా అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఈశాన్య రాష్ట్రమైన అస్సాం అప్పులు 14 శాతానికే పరిమితమై చివరి స్థానంలో నిలిచింది.

అప్పులు చేసి పీకల్లోతు కష్టాల్లో పది రాష్ట్రాలు ఉన్నాయని, అందులో పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ 41 శాతం, రాజస్థాన్ (39.8శాతం), బీహార్ 38.6 శాతం, మహిపూర్ 37.92 శాతం, కేరళ 37 శాతం, ఉత్తర్ ప్రదేశ్ 34.9 శాతం, పశ్చిమ బెంగాల్ 34.4 శాతం, ఝార్ఖండ్ 33 శాతం, ఆంధ్రప్రదేశ్ 33 శాతం, మేఘాలయ 32%, మధ్యప్రదేశ్ 31.3 శాతం, హర్యానా 29.4%, తమిళనాడు 27.4%, గోవా 27%, కర్ణాటక 26.6%, ఛత్తీస్ గఢ్ 26.2, మహారాష్ట్ర 17.84% మేరకు అప్పులు చేశాయి. అప్పల ఊబిలో ఇరుక్కుపోయిన రాష్ట్రాల జాబితాలో తెలంగాణ రాష్ట్రం లేదని ఆర్.బి.ఐ. నివేదిక స్పష్టంచేసిందని ఆ అధికారులు వివరించారు.

2022-23వ ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలో 24.7 శాతం ఉన్న అప్పులు కాస్తా నవంబర్ నెలాఖరు నాటికి 19 శాతానికి పడిపోయాయని ఆ అధికారులు వివరించారు. ఎందుకంటే ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టంలో మార్పులు, చేర్పులు చేసి కొత్త రూల్సు పేరుతో తెలంగాణకు రుణాలపై నిధులను సేకరించుకోవడానికి కేంద్రం అడుగడుగునా అడ్డుపుల్లలు వేయడంతోనే అప్పల శాతాలు గణనీయంగా తగ్గాయని ఆ అధికారులు వివరించారు.

ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టం ప్రకారం దేశం యావత్తూ 60 శాతం మాత్రమే అప్పలు చేయాలని, అందులో కేంద్ర ప్రభుత్వం 40 శాతం మేరకు అప్పలు తెచ్చుకోవచ్చునని, మిగిలిన 20 శాతం వరకూ రాష్ట్రాలు అప్పలు చేసుకోవచ్చునని ఆ చట్టం చెబుతోందని వివరించారు. అయితే కేంద్ర ప్రభుత్వమే ఎఫ్.ఆర్.బి.ఎం. చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి 84 శాతం వరకూ అప్పలు తెచ్చిందని, ప్రస్తుతం దేశం అప్పులు 152,17,910 కోట్ల రూపాయల మేరకు అప్పులున్నాయని వివరించారు.

దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ, మహారాష్ట్ర, అస్సాం రాష్ట్రాలు మాత్రమే ఎఫ్.ఆర్.బి.ఎం.చట్టానికి లోబడి నడుచుకొంటున్నాయని తెలిపారు. ఆర్.బి.ఐ.నివేదిక ప్రకారం పది రాష్ట్రాలు అప్పుల్లో ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని, అవి పంజాబ్, రాజస్థాన్, కేరళ, పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, ఝార్ఖండ్, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా రాష్ట్రాలున్నాయని, ఈ పది రాష్ట్రాల ఆర్ధిక నిర్వహణ కూడా అధ్వాన్షంగా ఉందని ఆర్.బి.ఐ. నివేదిక స్పష్టంచేసిందని వివరించారు. మరీ ముఖ్యంగా అయిదు రాష్ట్రాలైతే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నాయని, అవేమిటంటే బీహార్, కేరళ, పంజాబ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలున్నాయి.

ఇక ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాలైతే రికార్డుస్థాయిలో అప్పులు తెచ్చుకునే పరిధులు, ద్రవ్యలోటు పరిధులను కూడా దాటిపోయి ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయాయని, ఈ అయిదు రాష్ట్రాలు ఆర్ధికంగా ‘హైలీ స్ట్రెస్ ‘ను ఎదుర్కొంటున్న రాష్ట్రాలని ఆర్.బి.ఐ.నివేదికలో పేర్కొంది.

ఆర్ధిక సూత్రాలు, బడ్జెట్ నిర్వహణ, ఎఫ్.ఆర్.బి.ఎం. నిబంధనల మేరకు ఏ రాష్ట్రమైనా సొంత ఆదాయాల్లో పది శాతానికి మించకుండా సబ్సిడీలు, ఉచిత పథకాలను అమలు చేసుకోవచ్చునని, కానీ ఆంధ్రప్రదేశ్, గుజరాత్, పంజాబ్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పది శాతానికి మించిన స్థాయిలో నిధులను ఉచితాలు, సబ్సిడీలపై ఖర్చు చేస్తున్నాయని ఆర్.బి.ఐ.నిగ్గు తేల్చింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం జాతీయస్థాయిలో రికార్డు సృష్టించిన అనేక సంక్షేమలున్నప్పటికీ వాటికి ఖర్చు చేసే నిధులన్నీ పది శాతానికి లోబడే ఉన్నాయని ఆ అధికారులు వివరించారు.

దేశంలోకెల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధికంగా ఉచితాలు, సబ్సిడీపై ఏకంగా పది పథకాలు అమలవుతున్నాయని, ఈ పథకాల కోసం ఈ ఏడాది 27,541 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆర్.బి.ఐ. నివేదిక పేర్కొంది. ఈ నిధులు ఏపీ రాష్ట్ర జి.డి.పి.లో 2.1 శాతం కాగా రెవెన్యూ రాబడుల్లో 14.4 శాతం నిధులు ఖర్చు అవుతున్నాయని, రాష్ట్ర ఖజానాకు వచ్చే సొంత ఆదాయంలో నుంచి 30.3 శాతం నిధులను ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని ఆర్.బి.ఐ. పేర్కొంది. ఇలా ఎన్.డి.ఎ పాలనలో ఉన్న రాష్ట్రాలు ఆర్ధికంగా తీవ్రస్థాయిలో ఇబ్బందులు పడుతున్నాయని, డబుల్ ఇంజన్ రాష్ట్రాలన్నీ (అస్సాం, మహారాష్ట్ర మినహా) పీకల్లోతు అప్పల్లో కూరుకుపోయాయని వివరించారు.

ఇవి కూడా చదవండి…

ఆ 144 ఎంపీ స్థానాలపై బీజేపి గురి….

ఏపీలో ఎన్నికల వే ” ఢీ ” ?

పవన్ కళ్యాణ్ కు వారాహి చిక్కులు…

- Advertisement -