భారత మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ఇటీవల భారత జట్టులో ఆల్రౌండర్గా చోటు దక్కించుకున్న నితీష్ కుమార్ రెడ్డి ప్రదర్శనలపై, అతని పాత్రపై తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. మూడో వన్డే మ్యాచ్కు ముందు కైఫ్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ జట్టు ఎంపికపై కూడా విమర్శలు చేశారు.
భారత్–న్యూజిలాండ్ మధ్య మూడో వన్డే మ్యాచ్ జనవరి 17న ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో సమంగా ఉంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, రెండో వన్డేలో బ్లాక్ క్యాప్స్ గెలుపొందాయి. దీంతో నిర్ణాయక మ్యాచ్లో రెండు జట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ నేపథ్యంలో మొహమ్మద్ కైఫ్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ…ఎంపిక చేసిన జట్టును నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. రాజ్కోట్లో పిచ్ నెమ్మదిగా ఉన్నప్పటికీ మనం నలుగురు ఫాస్ట్ బౌలర్లతో ఆడాం. న్యూజిలాండ్ మాత్రం ముగ్గురు స్పిన్నర్లను ఆడించింది. బయట నుంచి వచ్చిన జట్టే పరిస్థితులను మెరుగ్గా అర్థం చేసుకుంది. స్పిన్ వారి బలంగా కాకపోయినా, వారు పిచ్ను సరిగ్గా చదివారు. భారత్ ప్లేయింగ్ ఎలెవన్, నితీష్ రెడ్డి పాత్ర నాకు అసలు అర్థం కాలేదు. కోచ్, మేనేజ్మెంట్ అతని పాత్ర ఏంటో చెప్పాలి అన్నారు.
Also Read:కొత్త అల్లుడికి పసందైన విందు!
నితీష్ రెడ్డి ఒక బ్యాటర్ మాత్రమేనని, ఆల్రౌండర్ కాదని కైఫ్ స్పష్టం చేశారు. అతను కేవలం బ్యాటర్. ఆల్రౌండర్ కాదు. భారత జట్టు ఇది ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత మంచిది. అతను ఆడుతున్నప్పుడు కెప్టెన్ కూడా పూర్తిగా కంఫర్ట్గా ఉండడం లేదు. అతన్ని ఆల్రౌండర్ అని చెప్పడం సరికాదు. అతను బౌలింగ్ చేయడంలేదు. ఆరో బౌలర్గా ఉపయోగపడటం లేదు. అసలు అతను పార్ట్టైమ్ బౌలర్ మాత్రమే…అవసరం కోసం ఓవర్ వేస్తున్నాడు అని కైఫ్ వ్యాఖ్యానించారు.

