డీకే అరుణ రాజీనామా…డ్రామా

225
- Advertisement -

మహబూబ్‌నగర్‌ జిల్లా గద్వాల కాంగ్రెస్‌ శాసనసభ్యురాలు డీకే అరుణ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆమె తాను గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నందుకే జిల్లాగా ప్రకటించడం లేదని…అందుకే తన పదవికి రాజీనామా చేస్తున్నాని తెలిపింది.తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపుతున్నానని, దానిని ఆయన సభాపతికి పంపాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

మరోవైపు డీకే అరుణ రాజీనామాపై టీఆర్ఎస్ మండిపడింది. రాజీనామాల పేరుతో కొత్తడ్రామాలకు తెరలేపుతోందని ఆ పార్టీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండిపడ్డారు.ఆమెకు దమ్ముంటే, చిత్త శుద్ధి ఉంటే తన రాజీనామా లేఖను స్పీకర్‌కు పంపించాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ డ్రామాలను తెలంగాణ ప్రజానీకం గమనిస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అరుణ వెన్నుచూపి పారిపోయిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంత్రి పదవికోసం తాకట్టుపెట్టిన చరిత్ర డీకే అరుణదని మండిపడ్డారు.ఇప్పటికైన వ్యక్తిగత ప్రయోజనాలను కట్టిపెట్టాలని సూచించారు.

వ్యక్తుల కోసం జిల్లాల విభజన జరగడంలేదని, పాలనా సౌలభ్యం, ప్రజాభిప్రాయం మేరకు జిల్లాల విభజన అనే విషయాన్ని డీకే అరుణ గుర్తుంచుకోవాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ అన్నారు.ఇప్పటికే డీకే అరుణపై గద్వాల ప్రజలు ఆగ్రహంతో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. జిల్లాల ఏర్పాటువిషయంలో రాజకీయాలు తగవని… కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా వనపర్తిని జిల్లా చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు నిరంజన్ రెడ్డి. పరిపాలన సౌలభ్యం కోసమే జిల్లా విభజన చేస్తున్నామని స్పష్టం చేశారు.అఖిలపక్ష సమావేశంలో గద్వాలను జిల్లా చేయాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలే ప్రామాణికమని తెలిపారు.

- Advertisement -