దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి- మంత్రి కేటీఆర్

124
minister ktr
- Advertisement -

అర్హులైన దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించారు. వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అధ్యక్షతన జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మానికి ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు స‌బితా ఇంద్రారెడ్డి, మ‌ల్లారెడ్డితో పాటు వికలాంగుల శాఖ డైరెక్టర్ శైలజ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ‌లో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నామ‌ని తెలిపారు. ఏ రాష్ట్రంలో చేయ‌ని విధంగా.. రూ. 24 కోట్ల 38 ల‌క్ష‌ల‌తో 16,600 మంది దివ్యాంగుల‌కు ఉచితంగా స‌హాయ ప‌రిక‌రాలు పంపిణీ చేయ‌డం సంతోషాన్నిస్తుంద‌న్నారు. నాలుగైదు నెల‌ల కింద‌ట దివ్యాంగుల స‌మ‌స్య‌ల ప‌ట్ల స‌మావేశం నిర్వ‌హించి కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు రూపొందించాల‌ని చాలెంజ్ చేయ‌డం జ‌రిగింది. అందులోని ఆవిష్క‌ర‌ణ‌ల‌ను కొన్నింటిని ఇవాళ దివ్యాంగుల‌కు అందిస్తున్నామ‌ని తెలిపారు.

ప్రీ మెట్రిక్, పోస్టు మెట్రిక్ స్కాల‌ర్‌షిప్‌ల‌ను అంద‌జేస్తున్నామ‌ని మంత్రి కేటీఆర్ చెప్పారు. నైపుణ్య శిక్ష‌ణా కేంద్రాల‌ను దివ్యాంగుల కోసం నిర్వ‌హిస్తున్నామ‌ని తెలిపారు. గ‌తంలో దివ్యాంగుల‌కు పెన్ష‌న్ల కింద రూ. 500 ఇస్తే.. తెలంగాణ ప్ర‌భుత్వం రూ. 3016 ఇస్తున్నామ‌ని పేర్కొన్నారు. డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌లో కూడా 5 శాతం ఇండ్ల‌ను దివ్యాంగుల‌కు కేటాయిస్తున్నామ‌ని తెలిపారు. ఈ నిబంధ‌న అన్ని జిల్లాల్లో అమ‌ల‌య్యే విధంగా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేశామ‌న్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగ నియామ‌కాల్లో 4 శాతం రిజర్వేష‌న్ల‌ను దివ్యాంగుల కోసం అమ‌లు చేస్తామ‌న్నారు. క‌ల్యాణ‌ల‌క్ష్మి, షాదీముబార‌క్ కింద దివ్యాంగుల వివాహాల‌కు రూ. 1,25,145 చొప్పున చెల్లిస్తున్నామ‌ని తెలిపారు. దివ్యాంగుల స‌మ‌స్య‌ల‌ను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ప‌రిష్కారిస్తామ‌ని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -