టీఆర్‌ఎస్‌ భారీ మెజార్టీతో గెలుస్తుంది- తలసాని

134
talasani
- Advertisement -

నేడు జరుగుతున్నఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్‌ ప్రగతి శంఖారావం సభలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. అభివృద్ధిని కొనసాగించేందుకు జంటనగరాల ప్రజలు టీఆర్‌ఎస్‌కు పట్టంకట్టాలని కోరారు. ఆలోచించి డిసెంబర్‌ 1న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసిన గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌ జంట నగరాల్లో గతంలో 99 స్థానాలను కైవసం చేసుకున్నాం. ఈసారి 104 స్థానాలకు పైగా గెలుస్తున్నామన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.

రాష్ట్రం ఏర్పాటు అనంతరం సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలు, మరోవైపు అభివృద్ది కార్యక్రమాలు పరుగులు తీయిస్తున్నట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, పెన్షన్లు, రోడ్లు, ఫ్లైఓవర్లు, పార్కులు, బస్తీ దావాఖానాలు, సీసీటీవీ కెమెరాలు, ఎల్‌ఈడీ లైట్లు ఇలా ప్రతీ సౌకర్యాన్ని కల్పించుకుంటున్నామన్నారు. హైదరాబాద్‌ ఐటీ సెక్టార్‌, పరిశ్రమలతో సిటీ వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు.

కరోనా వైరస్‌ గానీ, లాక్‌డౌన్‌ సమయంలో గానీ, వరదలు చుట్టుముట్టినప్పుడు గానీ మన ప్రభుత్వమే ప్రజలను ఆదుకుందన్నారు. సబ్బండ వర్గాలు సంతోషంగా ఉండాలనేది మన సీఎం కేసీఆర్‌ సంకల్పం అన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమంలో ప్రజలకు చేరువగా ఉన్నామన్నారు. హైదరాబాద్‌కు ఏం చేసినరో మాట్లాడకుండా కేవలం తిట్టే కార్యక్రమమే పెట్టుకుంది బీజేపీ అన్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర మంత్రులు, ఇక్కడి బీజేపీ నాయకులుగానీ పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు నగరానికి ఏం చేశారో చెప్పాలన్నారు.

- Advertisement -