రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవతో మహబూబ్ నగర్ లోని ఎదిరా గ్రామంలో సర్వే నెంబర్లు 556, 607 లలో దాదాపు 475 ఎకరాల్లోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా టీఎస్ఐఐసీ ద్వారా ఐటీ మరియు ఇండస్ట్రియల్ క్లస్టర్ను ఏర్పాటు చేయడానికి శ్రీకారం చుట్టారు. దీనికి సంబందించి ఈ నెల 31 మధ్యాహ్నం 12 గంటలకు ఐటీ టవర్ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, పరిశ్రమల శాఖ మరియు ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ మేనేజింగ్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, టీఎస్ఐఐసీ చీఫ్ ఇంజినీర్, టీఎస్ఐఐసీ జనరల్ మేనేజర్ లతో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మహబూబ్నగర్ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఐటీ, ఐటీఈఎస్లతో పాటు ఇతర అనుబంధ రంగాలలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రత్యేక చొరవ కారణంగా ఈరోజు హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
ఈ ఐటీ టవర్ను సుమారు 25 కోట్లతో 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం చేపట్టాలని తెలంగాణ ఐటీ శాఖ ప్రతిపాదనలను ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు. ఐటీ టవర్కు అనుబంధంగా ఇంక్యూబెషన్ సెంటర్, స్టార్టప్ల కోసం అత్యధునాతన జీ ప్లస్ టూ భవనంలో సుమారు 50 వేల ఎస్సేఫ్టీలలో ఐటీ పార్క్ను రూపొందించి జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెద్ద ఎత్తున కల్పించే లక్ష్యంతో ప్రారంభ సంస్థలకు ఐటి ఇంక్యుబేషన్కు అవసరమైన మౌలిక సదుపాయాలను అందిస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.