రాయలసీమ గుండాయిజం ఇక్కడ నడవదు: శ్రీనివాస్ గౌడ్

260
srinivas goud
- Advertisement -

రాయలసీమ గుండాయిజం తెలంగాణలో నడవదని… ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి దౌర్జన్యాలను సహించేది లేదని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హాకీ క్రీడాకారుడు ప్రవీణ్ రావు సహా అతని సోదరులను కిడ్నాప్ చేసినట్లు సమాచారం రాగానే ఘటనా స్థలికి వెళ్లినట్లు మంత్రి తెలిపారు.

ఈ ఘటనలో ఎంతటి స్థాయి వ్యక్తులున్నా వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు. హన్వాడ మండలం బుద్దారం గ్రామానికి చెందిన బీజేపీ జిల్లా నేత సుధాకర్ రెడ్డి సహా సుమారు 500 మంది బీజేపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరికల సందర్భంగా మంత్రి మాట్లాడారు. నమ్ముకున్న వాళ్లను టీఆర్ఎస్ పార్టీ కడుపులో పెట్టుకుని చూసుకుంటుందని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు.

పార్టీని, తమను నమ్ముకున్న వారికి అర్ధరాత్రి అపరాత్రి అనే తేడా లేకుండా ఎంతటి కష్టమొచ్చినా వెంటనే వారికి సాయం అందిస్తామన్నారు. కార్యకర్తలకు అండగా ఉండటంలో టీఆర్ఎస్ పార్టీకి ఎవరూ సాటిరారని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఊరు ఊరంతా కదిలిందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గత 25 ఏళ్లుగా గ్రామస్తుల ప్రధాన సమస్య అయిన బ్రిడ్జి నిర్మాణాన్ని గతంలో ఏ ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఇటీవలే బ్రిడ్జి నిర్మించి గ్రామస్తుల సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు.

టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వారికి, పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి ఎప్పటికైనా తగిన గుర్తింపు, న్యాయం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురికాకుండా బుద్ధారం గ్రామాన్ని కాపాడామనే కృతజ్ఞత గ్రామస్తుల్లో కనబడుతోందని ఆయన తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని ప్రజలు గమనిస్తున్నారని మంత్రి అన్నారు. బీజేపీ నాయకులు శాంతయ్య, శేఖర్, కేశవులు, రాజు, వెంకటయ్య, నర్సింహులుతో సహా సుమారు 500 మంది పార్టీలో చేరారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కొరమోని నర్సింహులు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.

- Advertisement -