వారికి దేవుడు అన్యాయం చేశాడు

614
Satyavathi Rathod
- Advertisement -

తల్లిదండ్రులను దూరం చేసి, వారి బాల్యాన్ని కూడా అనుభవించకుండా దేవుడు వారికి అన్యాయం చేశాడు…కనీసం మనమైనా మానవత్వంతో వ్యవహరించి, తల్లిదండ్రులు లేని లోటు తీర్చి వారికి న్యాయం చేద్దామని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. సైదాబాద్ లోని జువెనైల్ హోమ్ ని నేడు సందర్శించి బాల నేరస్తులతో ఆమె గడిపారు. జువెనైల్ హోమ్ లోని బాలలు ఎందుకు నేరాలు చేస్తున్నారు, ఏ పరిస్థితుల్లో నేరాలు చేస్తున్నారు, కారణాలేమిటని అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపం వల్ల, చెడు స్నేహాలవల్లే ఎక్కువమంది తాము నేరస్తులుగా మారామని బాలలు చెప్పడంతో…వీటిని నిరోదించాలంటే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అభిప్రాయపడ్డారు.

కొంతమంది బాలలు తమను చూడడానికి కూడా తల్లిదండ్రులు రావడం లేదని మంత్రి గారితో బాధను వ్యక్తం చేయగా…వెంటనే వారి తల్లిదండ్రులను ఇక్కడకు తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని, పిల్లలతో తల్లిదండ్రులు కలిసేలా చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. తల్లిదండ్రులు లేని బాలలను గురుకులాల్లోనూ, చిల్డ్రన్ హోమ్స్ లో పెట్టి వారి సంరక్షణ బాధ్యతలు మనమే చూసుకుందామని, వారికి తల్లిదండ్రులు లేని లోటు తీర్చేలా వ్యవహరిద్దామన్నారు. నేరాలు చేసి వచ్చారని ఈ పిల్లలను ఏ పరిస్థితుల్లోనూ తక్కువగానూ, చిన్నచూపుతో చూడవద్దని, జువెనైల్ హోమ్ లో వారికి అన్ని రకాల వసతులు కల్పించాలని, పిల్లలు పొందే హక్కులన్నింటిని వారికి కల్పించాలని సూచించారు.

ఇక్కడకు వచ్చిన బాలలకు కూడా వారు చేసిన తప్పు తెలుసుకునేలా, తిరిగి మరోసారి ఇలాంటి తప్పులు చేయకుండా మంచి కౌన్సిలింగ్ ఇవ్వాలని కౌన్సిలర్లకు సూచించారు. పిల్లలకు కూడా మరోసారి తప్పులు చేయవద్దని , మీ అమూల్యమైన బాల్యాన్నికోల్పోవద్దని, తల్లిదండ్రులు చెప్పిన బాటలో నడవాలని హితవు చెప్పారు.బాలలు తినే ఆహారాన్ని, వారి ప్లే గ్రౌండ్ ను, బాలల విశ్రాంతి గదులు, వారికి అందిస్తున్నవసతులను మంత్రి గారు పర్యవేక్షించారు. ఈకార్యక్రమంలో జువెనైల్ హోమ్ డైరెక్టర్ డాక్టర్ శైలజా, సూపరింటెండ్ లక్ష్మీ రాజం, ఇతర అధికారులు పాల్గొన్నారు.

minister Satyavathi Rathod Visits Saidabad Juvenel Home..

- Advertisement -