ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వం: మంత్రి నిరంజన్‌ రెడ్డి

264
Minister Niranjan Reddy
- Advertisement -

కరోనా నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రానివ్వమని తెలిపారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ ను తాత్కాలికంగా సరూర్ స్టేడియంలోకి తరలించడానికి ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసి తగు ఏర్పాట్లకు సూచనలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్లు, పలు ఖాళీ ప్రదేశాలకు కూరగాయల మార్కెట్లు తరలించాలన్నారు.

కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా ఏర్పాట్లు .. కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించాలన్నారు. మొబైల్ రైతుబజార్ల ద్వారా వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలకు తక్కువ ధరకు తాజా కూరగాయలు అందిస్తామన్నారు.

ఆయా అపార్ట్ మెంట్లు, కాలనీ వాసుల నుండి గత నాలుగు రోజులుగా మంచి స్పందన లభిస్తుందని… కూరగాయలు కావాల్సిన కాలనీ, అపార్ట్ మెంట్ల వాసులు 7330733212 నంబరుకు కాల్ చేసి నమోదు చేసుకుంటే వాహనం వచ్చే సమయం చెబుతారన్నారు. మొబైల్ రైతుబజార్ నడపాలనుకుంటున్న యువకులు, ఇతరులు కూడా ఈ నంబరును సంప్రదించవచ్చన్నారు.

ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని..సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తూ అన్ని వర్గాల ప్రజలకు ఇబ్బందులు రాకుండా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి వలస వచ్చిన కూలీలను కూడా వారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్న వారు.. వారికి ఏ కష్టం రాకుండా చూసుకుంటాం అని వారికి వసతి కల్పిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

- Advertisement -