నానో యూరియా విరివిగా వాడండి- మంత్రి నిరంజన్ రెడ్డి

92
- Advertisement -

ఈరోజు హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో జరిగిన సమావేశంలో గుజరాత్ రాష్ట్రంలోని కలోల్ నుండి తెలంగాణకు బయలుదేరిన మొదటి నానో యూరియా ట్రక్‌ను ఆన్ లైన్ ద్వారా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సమావేశంలో ఇఫ్కో వైస్ చైర్మన్ దిలీప్ సంఘానీ, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు,ఇఫ్కో ఎండీ డాక్టర్ అవస్తీ, మార్కెటింగ్ డైరెక్టర్ యోగేంద్ర కుమార్ , సీజీఎం డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డైరెక్టర్ దేవేందర్ రెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ మారుతి కుమార్ తదితరులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నానో యూరియా విరివిగా వాడండి. భారతీయ రైతుల సొంత ఎరువుల సహకార సంస్థ (ఇఫ్కో )చే నానో టెక్నాలజీ ద్వార ఆవిష్కరింపబడిన నానో యూరియా ఇది అన్నారు. ఇఫ్కో విడుదల చేసిన ఈ నానో యూరియా ప్రభుత్వాలకు ఎంతో సబ్సిడీ భారాన్ని, రవాణా, నిల్వ ఖర్చులు తగ్గిస్తుంది. ఒక బస్తా మీద దాదాపు రూ.800 నుండి రూ.1000 వరకు ప్రభుత్వాలకు సబ్సిడీ భారం తగ్గిస్తుంది. కేవలం రూ.240కి లభించే 500 ఎంఎల్ లిక్విడ్ బాటిల్ ఒక బస్తా యూరియాకు ప్రత్యామ్నాయంగా పని చేస్తుంది.. ఇఫ్కో ఈ ఘనత సాధించడం గర్వించదగ్గ విషయం అని మంత్రి కొనియాడారు.

ప్రపంచంలో మొదటి సారిగా ఈ నానో యూరియాకు ఇఫ్కో సంస్థ పేటెంట్ కలిగి ఉండడం సంతోషకరం విషయం. ప్రస్తుతం యూరియా వల్ల భూమికి, నీటికి, గాలికి అవుతున్న కలుషితాన్ని నానో యూరియా నివారించి పర్యావరణాన్ని కాపాడుతుండడం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయోగపడే అంశం అన్నారు. కార్పోరేట్ సంస్థల నుండి కాకుండా ప్రభుత్వ పరిధిలోని సహకార సంస్థ నుండి ఇలాంటి పరిశోధనా ఉత్పత్తి రావడం ఆహ్వానించదగిన పరిణామం అని మంత్రి చెప్పారు. దీనిని పెద్ద ఎత్తున ప్రచారం చేసి మార్కెట్ లోకి తీసుకుపోవాలి.. తెలంగాణ వ్యవసాయ శాఖ దీనిని పెద్ద ఎత్తున చేపడుతుంది అని మంత్రి తెలిపారు.

ఏ పంటకైనా పూతకంటే ముందు, విత్తిన 20 రోజుల తర్వాత యూరియాకు ప్రత్యామ్నాయంగా రెండు సార్లు పిచికారి చేసుకోవచ్చు మామూలు యూరియాకు 30 శాతం సమర్ధత ఉంటే నానో యూరియా 80 శాతం సమర్ధంగా ఉండడంతో పాటు 8 శాతం దిగుబడి పెరుగుతుందని ఐకార్ పరిశోధనలలో వెల్లడయింది. పంట ఉత్పత్తుల నాణ్యత కూడా అధికంగా ఉంటుందని తేలింది. ప్రస్తుతం వాడుతున్న యూరియా కన్నా తక్కువ మోతాదు, తక్కువ ధరలో ఎక్కువ ఫలితాలు నానో యూరియా ఇస్తుంది. ఇది పెద్ద ఎత్తున అందుబాటులోకి వస్తే ప్రస్తుతం వాడుతున్న యూరియా వాడకం 50 శాతం తగ్గుతుంది. ఎరువుల నియంత్రణ చట్టం కింద ఆమోదం పొందిన ఈ నానో యూరియా క్షేత్ర స్థాయిలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

- Advertisement -