చారిత్రక మార్పుకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు..

240
Niranjan Reddy On Comprehensive Agriculture Policy
- Advertisement -

హైదరాబాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లాల రైతుబంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ అధికారులు,వ్యవసాయ ఉన్నతాధికారులు,శాస్త్రవేతలతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి,వీసీ ప్రవీణ్ రావు, విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు తదితరులు హాజరైయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైనా, అమెరికాలను మన ఉత్పాదనలు అధిగమించాలి. మానవ వనరులు, సాగుభూమి పుష్కలంగా ఉన్నా మనం వారిని అందుకోలేకపోతున్నాం. అమెరికాలో వ్యవసాయం చేసేవారు 30 శాతం నుండి 3 శాతానికి పడిపోయినా వారు అగ్రస్థానంలోనే ఉన్నారు. మన దేశంలో 60 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీదే ఆధారపడింది. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరేళ్లుగా వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రైతుబంధు సమితి అధ్యక్షులు నూతన వ్యవసాయ విధానంపై క్షేత్రస్థాయి అభిప్రాయాలు వెల్లడించాలి.అధికారులు, శాస్త్రవేత్తలతో పాటు మీ అనుభవాలు, క్షేత్రస్థాయిలో రైతుల అభిప్రాయాలు ఎంతో ముఖ్యం. మన ఆహార అవసరాలకు అవసరమైన పంటలు పండిస్తున్నాం. కానీ ప్రపంచానికి అవసరమైన, ఆదాయాన్నిచ్చే పంటలను పండించాల్సి ఉంది అని మంత్రి తెలిపారు.

Niranjan Reddy On Comprehensive Agriculture Policy

తెలంగాణ ఏర్పడే నాటికి రైతాంగానిది దిక్కుతోచని పరిస్థితి. అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పట్ల సానుకూల నిర్ణయాలు తీసుకున్నారు. అంబలికేంద్రాలతో ఆకలి తీర్చుకున్న తెలంగాణ ఆరేళ్లలో అన్నపూర్ణగా మారింది.కుదేలయిన సేద్యాన్ని కుదుటపరిచి దీని మీద బతకగలం అన్న విశ్వాసం కలిగించింది ముఖ్యమంత్రి కేసీఆర్.42 శాతం జీడీపీ వ్యవసాయరంగం నుండే వస్తుంది.అర్థికవేత్తలు 14.5 శాతం అంటారు కానీ వ్యవసాయ అనుబంధరంగాలు కలిపితే 42 శాతం ఉంటుంది. ఆర్థిక నిపుణులు ఎందుకు వ్యవసాయరంగంపై పెట్టే పెట్టుబడులను చిన్నచూపు చూస్తున్నారో అర్థం కాదు. 52 శాతం రైతులు అప్పుల్లో ఉంటారన్నది నిపుణుల నివేదిక సారాంశం. వారు ఆ అప్పుల ఊబి నుండి బయటకు రావాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగంలో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు.

మొగులు వైపు తెలంగాణ రైతు ఎదురుచూడొద్దు .. సమయం వచ్చిందంటే అరక కట్టాలి. గోదావరి, కృష్ణ నదులుండి రైతులు ఇబ్బందులు పడొద్దనే కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం ప్రతిష్టాత్మకంగా చేపట్టారు.రైతులు మార్చి చివరి నాటికి యాసంగి వరి కోతలు పూర్తయ్యేలా సాగుచేస్తే అకాలవర్షాల మూలంగా నష్టపోయే పరిస్థితి తప్పుతుంది. తెలంగాణ ఆహార సెజ్‌లకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు భారీ ఎత్తున వస్తాయి. దీనికి సంబంధించిన విధాన నిర్ణయం ముఖ్యమంత్రి త్వరలో ప్రకటిస్తారు. మార్కెట్‌లో ధరలేదని, అమ్మితే లగేజీ ఛార్జీలు రావని కూరగాయల గంపలను రైతులు బస్సులోనే వదిలేసి పోయిన సంఘటనలు ఉద్యమంలో మేము ప్రత్యక్ష్యంగా చూశాం. సన్నబియ్యం పండించి అందరికి అందించే రైతన్న దొడ్డు బియ్యం తినే దుస్థితి నెలకొంది.ఈ పరిస్థితి నుండి రైతు బయటకు రావాలి అని నిరంజన్‌ రెడ్డి పేర్కొన్నారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ జెండాపట్టి రాష్ట్రాన్ని సాధించినం. ఇప్పుడు రైతుల కోసం పనిచేస్తున్నాం ఇంతకుమించిన అదృష్టం ఏముంటుంది.ఈ దేశం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయ రంగంలో హరిత, శ్వేత, నీలి,పసుపు తదితర రకాల విప్లవాలు వచ్చాయి. ఇప్పుడు మనం మరో విప్లవం దిశగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే నియంత్రిత సమగ్ర వ్యవసాయం అని మంత్రి నిరంజన్‌ రెడ్డి వివరించారు.

- Advertisement -