మరోసారి కేంద్రానికి లేఖ రాసిన మంత్రి కేటీఆర్..

83
ktr
- Advertisement -

సమగ్ర పవర్‌లూమ్ క్లస్టర్ డెవలప్‌మెంట్ స్కీమ్ (సీపీసీడీఎస్) కింద సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు రాసిన లేఖలో కోరారు. సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ కావాలని కోరుతూ మంత్రి కేటీఆర్ గతంలో కేంద్ర ప్రభుత్వానికి ఏడు లేఖలు (వివిధ తేదీల్లో) రాశారు. పై విషయానికి సంబంధించి లేఖలు మరియు వ్యక్తిగత సమావేశాల ద్వారా పదేపదే గుర్తు చేసినప్పటికీ, దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్య తీసుకోలేదన్నారు.కొన్ని దశాబ్దాలుగా సిరిసిల్ల చేనేత, జైళీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉందని మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని తెలిపారు. మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, శిక్షణ పొందిన మానవ వనరులున్నాయని పేర్కొన్నారు. చేనేత, జౌళిరంగం సర్వతోముఖాభివృద్ధికి, నేత కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. 40శాతం ఇన్‌ఫుట్‌ సబ్సిడీ వేజ్ కాంపెన్సేషన్ స్కీమ్, థ్రిఫ్ట్‌ఫండ్‌ తదితర పథకాలతో చేనేత, పవర్‌లూమ్‌ కార్మికులకు నిరంతరం పని అందించి ఆదాయం పెంపునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గతంలో వివిధ సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కార్యక్రమాలను కేంద్రం ప్రసంశించిన విషయాన్ని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్రానికి, చేనేత, జౌళిరంగానికి సంబంధించి కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ సహకారం అందించకపోవడంపై మంత్రి కేటీఆర్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వంటి ప్రగతి శీల రాష్ట్రాలకు కేంద్రం ఆదరణ కల్పించకపోవడంతో నేడు మన దేశం చిన్న దేశాలతో కూడా పోటీపడలేకపోతుందన్నారు. అదే సమయంలో తెలంగాణ టెక్స్‌టైల్‌ రంగంలో పలు పెట్టుబడులను ఆకర్షించగలిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం చేనేత, జౌళి రంగానికి అదనపు బడ్జెట్‌ను కేటాయించిందని, కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ వంటి ప్రపంచస్థాయి ప్రాజెక్టులను చేపట్టిందని పేర్కొన్నారు.

అవసరమైన వ్యవస్థ, వనరులు లేని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పథకాలు సహాయాన్ని ప్రకటిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్‌.. దీని వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నష్టమన్నారు. మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌వంటి ప్రాజెక్టుల ద్వారా ఏర్పడే ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. ఇకనైనా ఆలస్యం చేకుండా మెగా పవర్‌లూం క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానన్నారు మంత్రి కేటీఆర్‌.

- Advertisement -