హైదరాబాద్ అనగానే.. చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం. వీటితో పాటు సైబర్ టవర్స్, హైటెక్సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి.. ఇక తాజాగా ఈ వరుసలో చేరనున్నది దుర్గం చెరువు కేబుల్ వంతెన. ప్రారంభానికి ముందే ఎంతగానో ప్రచారమైన దుర్గం చెరువు కేబుల్ వంతెన.. ప్రారంభానంతరం పర్యాటక ప్రాంతంగానూ మారనుంది. ఈ కేబుల్ వంతెన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది.శుక్రవారం మంత్రి కేటీఆర్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్తో కలిసి సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు వంతెనను ప్రారంభించనున్నారు. కొద్ది రోజుల కిత్రమే దీని నిర్మాణం పూర్తయ్యింది.
దీని నిర్మాణానికి సుమారు 185 కోట్లు వెచ్చించింది తెలంగాణ ప్రభుత్వం. దీని పొడవు సుమారు 754.38 మీటర్లు కాగా ఆరు లైన్లు వెడల్పుతో నిర్మించారు. పాదాచారులకు, సైకిలిస్టుల కోసం బ్రిడ్జిపై ప్రత్యేక ట్రాకులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసి లైటింగ్ రాత్రివేళ వంతెన అందాన్ని మరింత పెంచేలా ఉంది. ఈ వంతెన జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 45ను ఐటీ కారిడార్ను అనుసంధానం చేయనుంది.