సీఎం కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్దపీట- మంత్రి కేటీఆర్

51
- Advertisement -

మహిళలకు సమాన హక్కులు కల్పించడంలో విద్యుత్ రంగం అద్భుతమైన ఫలితాలు సాధించిందని రాష్ట్ర ఐటి మరియు పురపాలక శాఖామంత్రి కేటీ రామరావు పేర్కొన్నారు. యావత్ ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా విద్యుత్ రంగంలో 217 మంది మహిళలకు లైన్ మెన్ లుగా అవకాశం కల్పించడం అభినందనీయమని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని యస్ ఆర్ నగర్ జి టి యస్ కాలనీ లో ఉన్న జెన్కో ఆడిటోరియంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు హాజరయ్యారు.ఈ సందర్భంగా లైన్ మెన్ లుగా ఎంపికయిన మహిళలను మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి లు ఘనంగా సత్కరించారు.

అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణా రాష్ట్ర విద్యుత్ రంగంలో జరిగిన ఈ నియామకాలు యావత్ భారత దేశానికి మార్గదర్శనం కావాలన్నారు.లైన్ మెన్ లే కాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణా ప్రభుత్వం లో విద్యుత్ రంగంలో జరిగిన నియామకాలలో 9,644 మంది ఎంపికయితే అందులో 50% మహిళలు ఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. ప్రభుత్వ రంగంలో అన్ని శాఖలకు ఈ నియామకాలు ఆదర్శంగా నిలబడాలని ఆయన ఆకాంక్షించారు. లింగ వివక్ష లేని సమాజం నిర్మాణం కావలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటన్నారని ఆయన చెప్పారు.

మహిళలకు విద్యా అవకాశాలు కల్పించడం ద్వారా మాత్రమే మహిళ సాధికారిక సాధించ వచ్చన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచన అని ఆయన చెప్పుకొచ్చారు.గతంలో మైనారిటీలకు చెందిన మహిళల శాతం కేవలం 18%ఉండగా ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలతో ఒక్కసారిగా 42% నికి చేరిందన్నారు. మహిళల భద్రతకు తెలంగాణా పెట్టింది పేరు అన్నారు. అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన షి టీమ్స్,భరోసా కేంద్రాలు,ఆపదలో ఉన్న వారికి హాక్ ఐ మొబైల్ అప్లికేషన్ లే కారణమన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో మహిళలకు పెద్ద పీట వేశారనడానికి వీటితో పాటు కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ పధకం ద్వారా పేదింటి ఆడపడుచులకు కట్నంగా లక్షా నూట పదహారు రూపాయలు అందిస్తున్న ప్రభుత్వ సాయలే అద్దం పడుతున్నాయాన్నారు.వీటికి తోడు కేసీఆర్ కిట్,ఆసరా ఫించన్లు,వడ్డీలేని రుణాలు,మాతా శిశు సంరక్షణ కోసం మౌలిక వసతుల కల్పన అన్నింటికీ మించి బిందెడు నీళ్ల కోసం మైళ్ళ దూరం నడవ కుండా ఉండేందుకు గాను మిషన్ భగీరథ వంటి విప్లవాత్మకమైన మైన పధకాలను రూపొందించిన రూప శిల్పి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అంతే గాకుండా ఆరోగ్య పరిరక్షణ లో అందులో మహిళల ఆరోగ్యం కాపాడడంలో తెలంగాణా ప్రభుత్వం అద్భుతమైన ఫలితాలు సాదించిందన్నారు.ఆరోగ్య పరిరక్షణకు సాలీనా నిధుల కేటాయింపు లో యావత్ భారత దేశంలోనే తెలంగాణా రాష్ట్రము మూడవ స్థానంలో నిలిచిందన్నారు.

విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. ట్రాన్స్‌కో, జెన్‌కో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను పూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతి అని ఆయన నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రారంభించినా ఆ పథకానికి మహిళల పేరు వచ్చేలా చర్యలు తీసుకోవడమే అందుకు నిదర్శనమన్నారు. 22 సంవత్సరాలు గా ఆయన తో చేసిన సహచర్యంతో మహిళలు అంటే ఎంతటి అభిమానం ఉందన్నది అవగతమైందన్నారు. ముఖ్యంగా ఇంటి పెత్తనం మహిళల చేతిలో ఉన్నట్లయితే దుబారా ఉండదని ఆర్థిక క్రమశిక్షణ ఉంటుందని తద్వారా ఆ కుటుంబం అద్భుతమైన విజయాలు నమోదు చెలుకుంటుందని నమ్మే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన తెలిపారు. కళ్యాణాలక్ష్మి/షాది ముబారక్ పధకం లో బాగంగా ప్రభుత్వం అందించే లక్షా నూట పదహారు రూపాయల చెక్ ను ఆడపిల్ల తల్లి పేరు మీదనే ఇవ్వాలని తీసుకున్న నిర్ణయం ఆయన కున్న దూర దృష్టి కి అద్దం పడుతుందని మంత్రి జగదీష్ రెడ్డి కొనియాడారు.

- Advertisement -