ఐటి, పరిశ్రమల శాఖలపై మంత్రి కేటీఆర్ సమీక్ష..

149
ktr
- Advertisement -

ఐటి మరియు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు పరిశ్రమలు మరియు ఐటీ శాఖల కార్యక్రమాలపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో పాటు టిఎస్ఐఐసి చైర్మన్ బాలమల్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ ఆలోచనల మేరకు ఐటీ పరిశ్రమలను నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు విస్తరించే కార్యక్రమాలపైన మంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్ నగరాలకు ఐటీ పరిశ్రమలను విస్తరించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపిన మంత్రి, ఎల్లుండి ఖమ్మం పట్టణంలోని ఐటీ టవర్ ను ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతోపాటు వరంగల్ నగరానికి సంబంధించి ఇప్పటికే పలు ఐటి కంపెనీలు తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయని, రెండవ దశలో మరిన్ని ఐటీ కంపెనీలు వరంగల్ నగరంలో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నాయని, అందుకు సంబంధించి అవసరమైన మౌలిక వసతులను, ఇతర సదుపాయాలకు సంబంధించి టిఎస్ఐఐసి చేపడుతున్న కార్యాచరణ పైన మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఒకటి రెండు ప్రముఖ కంపెనీలు త్వరలోనే వరంగల్ నగరానికి వస్తాయని, ఇందుకు సంబంధించి ఆయా కంపెనీలతో తెలంగాణ ఐటీ శాఖ చర్చలు నిర్వహిస్తుందని, వాటికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు హైదరాబాద్ మహానగరంలోనూ ఇతర ప్రాంతాలకు ఐటీ పరిశ్రమల విస్తరించాలన్న ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన గ్రోత్ ఇన్ డిస్పర్షన్ (గ్రిడ్) పాలసీకి మంచి స్పందన లభిస్తోందని తెలిపారు. ఈ సందర్భంగా ఉప్పల్ మరియు నాచారం వంటి ఇండస్ట్రియల్ ఏరియాలో ఐటీ పార్కుల నిర్మాణానికి సంబంధించి జరుగుతున్న కార్యాచరణను తెలుసుకున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వానికి తమ ఆసక్తిని తెలియజేసిన కంపెనీలు, ఐటీ పార్కులను నిర్మాణం చేసేందుకు అవసరమైన సంపూర్ణ సహకారాన్ని ప్రభుత్వం తరఫున ఆయా కంపెనీలకు అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ని టెలిఫోన్ లో మంత్రి కోరారు.

దీంతోపాటు కొంపల్లి ప్రాంతంలో ఒక ఐటి పార్క్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణ త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని టిఎస్ఐఐసి ఎండి నరసింహ రెడ్డికి మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే జిల్లా రెవెన్యూ యంత్రాంగంతో పాటు హెచ్ఎండిఏ సహకారంతో కొంపల్లిలో ఐటీ పార్క్ కు సంబంధించిన స్థల గుర్తింపు జరిగిందని, త్వరలోనే అక్కడ శంకుస్థాపన వేసేందుకు అన్ని సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా ఆయన మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. దీంతో పాటు మహబూబ్ నగర్ దివిటిపల్లి ప్రాంతంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని, వాటికి సంబంధించి కూడా పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ తెలియజేశారు.

పరిశ్రమల శాఖ ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ లో అగ్రస్థానాన్ని సాధించేందుకు కసరత్తు చేస్తుందని పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్ రాజ్ మంత్రి కేటీఆర్ కి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ పాలసీలతో పాటు ఇక్కడి నాయకత్వం పరిశ్రమల మరియు పెట్టుబడుల ఆకర్షణకు ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఇక్కడి వాతావరణం పెట్టుబడులకు అత్యంత స్నేహపూర్వకంగా ఉన్న నేపథ్యంలో, కేవలం సాంకేతిక అంశాల వలన గత సంవత్సరం తక్కువ ర్యాంకు వచ్చిన నేపథ్యంలో, ఈసారి అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కు మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మేరకు ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ కోసం అవసరమైన అన్ని సంస్కరణలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా పరిశ్రమల శాఖ కమిషనర్ మంత్రి కేటీఆర్ కి తెలియజేశారు. ఖచ్చితంగా ఈసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో మంచి స్థానాన్ని సంపాదిస్తామని ఆయన కేటీఆర్ కి తెలిపారు.

- Advertisement -