త్వరలో నూతన ఐటీ పాలసీ- మంత్రి కేటీఆర్‌

185
minister ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రకటించిన ఐటీ పాలసీ ఐటి పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసిందని, తెలంగాణకి అద్భుతమైన పేరును, పెట్టుబడులను, ఉపాధి అవకాశాలను సంపాదించిపెట్టింది అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. త్వరలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న ఐటీ పాలసీ స్థానంలో నూతన ఐటీ పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈరోజు ఐటీ శాఖ విభాగాధిపతులతో జరిగిన సమీక్ష సమావేశంలో నూతన ఐటీ పాలసీకి సంబంధించి, అందులో పేర్కొనవలసిన అంశాల పైన మంత్రి కేటీఆర్ మార్గదర్శనం చేశారు. ఏ పాలసీ అయినా పౌరుల కేంద్రంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావు ఆలోచన అని, ఆ దిశగానే ఇప్పటిదాకా తెలంగాణ ప్రభుత్వం అనేక నూతన విధానాలకు రూపకల్పన చేసిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గత ఆరు సంవత్సరాలుగా ఐటీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలను సమీక్షించిన మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ను మరింత బలోపేతం చేస్తూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులని ఈ రంగంలో తీసుకువచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. పెట్టుబడులతో పాటు ఐటీ శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సేవల పైన ప్రధాన దృష్టి సారించాలని, పౌరుడేగా కేంద్రంగా ప్రభుత్వ సేవలు అందించే విధానాలకు రూపకల్పన చేయాలని సూచించారు. ఈ దిశగా ఇప్పటికే గత ఆరు సంవత్సరాలుగా ఈ -గవర్నెన్స్, ఆన్లైన్ మరియు మొబైల్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వ సేవలను అందించిన విషయాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. సమీప భవిష్యత్తులో ప్రజలకు అందుబాటులోకి రానున్న టీ ఫైబర్ కార్యక్రమం ద్వారా అందించాల్సిన కార్యక్రమాల పైన ఇప్పటి నుంచి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

గత ఆరు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో బలమైన ఇన్నోవేషన్ ఈకో సిస్టం ఏర్పడిందని, ఇకపైన ఈ ఈకో సిస్టం ను మరింత బలోపేతం చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లోకి కూడా ఇన్నోవేషన్ తీసుకునే విధంగా కార్యక్రమాలు రూపొందించాలన్నారు. ముఖ్యంగా విద్యార్థులను ఇన్నోవేటర్లుగా మార్చేందుకు కావాల్సిన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. గత ఆరు సంవత్సరాలుగా నూతన పెట్టుబడులను హైదరాబాద్ కి, తెలంగాణకి రప్పించడం ద్వారా లక్షలాది ఉపాధి అవకాశాలను కల్పించామని, భవిష్యత్తులోనూ దీన్ని కొనసాగిస్తామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం స్థానిక యువత కి ఎక్కువ ఉపాధి అవకాశాలు కల్పించే కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటించిందని, దీంతో పాటు స్థానిక యువతకు మరిన్ని ఉద్యోగాలు దక్కేలా తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) ద్వారా శిక్షణ కార్యక్రమాలను రూపొందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, తద్వారా స్థానిక యువతకు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉన్నదని, ఈ దిశగా అవసరమైన కార్యాచరణను చేపట్టామని అన్నారు. ఈ సమావేశంలో ఐటీ శాఖ విభాగాధిపతి లతోపాటు ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ పాల్గొన్నారు.

- Advertisement -