తెలంగాణకు 12 అవార్డులు.. కేటీఆర్‌ అభినంద‌న‌లు..

126
- Advertisement -

మాస‌బ్‌ట్యాంక్‌లోని సీడీఎంఏ ఆఫీసులో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. స్వచ్ఛ భారత్‌ మిషన్‌లోని పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా నిలవడం, కేంద్రం ప్రకటించిన అవార్డుల్లో రాష్ట్రాల క్యాటగిరీలో తెలంగాణకు 12 అవార్డులు రావడం పట్ల రాష్ట్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, మున్సిప‌ల్ శాఖ మంత్రి కేటీఆర్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

గ‌త ఏడున్న‌ర సంవ‌త్స‌రాలుగారాష్ట్రం అన్ని రంగాల్లో స‌ర్వ‌తోముఖాభివృద్ధి సాధిస్తోంది. వివిధ కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తూ అభివృద్ధిలో ముందుకు పోతున్నాం అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. ప‌ట్ట‌ణాలు అభివృద్ధి చెందాల‌నే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప‌ట్ట‌ణాభివృద్ధిలో స‌మూల‌మైన మార్పులు తీసుకువ‌చ్చారు. ఆద‌ర్శ‌వంత‌మైన ప‌ట్ట‌ణాల‌ను రూపొందించేందుకు సీఎం కేసీఆర్ కొత్త‌ మున్సిప‌ల్ చ‌ట్టాన్ని తీసుకొచ్చారు. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం కూడా అమ‌లు చేశారు. మున్సిపాలిటీల సంఖ్యను 68 నుంచి 142కు పెంచాం. మున్సిపాలిటీల‌కు నిధుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు విడుద‌ల చేస్తున్నాం. ఇప్ప‌టి వ‌ర‌కు వివిధ పుర‌పాల‌క సంఘాల‌కు రూ. 2,950 కోట్లు విడుద‌ల చేశాం. పార్కులు, మోడ‌ల్ మార్కెట్లు, వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు, ఎల్ఈడీ లైట్లు, ప‌బ్లిక్ టాయిలెట్స్, వైకుంఠ‌ధామాలు, ఓపెన్ జిమ్స్, అర్బ‌న్ లంగ్ స్పేసెస్‌కు నిధులు ఖ‌ర్చు పెట్టాం. మౌలిక వ‌స‌తుల మీద దృష్టి సారించాం. అర్బ‌న్ మిష‌న్ భ‌గీర‌థ కార్య‌క్ర‌మంలో భాగంగా నీటి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాం. పారిశుద్ధ్య నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి స‌మ‌గ్ర‌మైన ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతున్నాం. కొత్త డంప్ యార్డులు ఏర్పాటు చేశాం. దేశంలో ఎక్క‌డా లేని విధంగా చ‌ట్టంలోనే గ్రీన్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్టి, హ‌రిత ప‌ట్ట‌ణాల‌ను త‌యారు చేసేందుకు కృషి చేస్తున్నాం. టీఎస్ బీపాస్ చ‌ట్టాన్ని అమ‌లు చేశాం అని మంత్రి కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

ఇప్ప‌టి దాకా తీసుకొచ్చిన చ‌ట్టాల‌న్నీ పౌరుడి కేంద్రంగా తీసుకువ‌చ్చాం అని కేటీఆర్ పేర్కొన్నారు. దీంతో చాలా ఫ‌లితాలు వ‌చ్చాయ‌న్నారు. మ‌న కార్య‌క్ర‌మాల‌కు వివిధ సంద‌ర్భాల్లో కేంద్రం గుర్తింపు ఇచ్చింది. తాజాగా శానిటేష‌న్ ఛాలెంజ్‌లో భాగంగా 4300 న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాలు పోటీ ప‌డితే తెలంగాణ‌కు 12 పైచిలుకు అవార్డులు వ‌చ్చాయి. ఈ అవార్డులు రావడాన్ని ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తికి ల‌భించిన గుర్తింపుగా భావిస్తున్నాం. ఈ నెల‌ 20న విజ్ఞాన భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా ఈ అవార్డులు అందుకోబోతున్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, అధికారుల‌కు గ‌ర్వ‌కార‌ణం. మున్సిప‌ల్ అధికారుల‌ను హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను అని కేటీఆర్ తెలిపారు.

జాతీయ స్థాయిలో మాత్ర‌మే కాకుండా రాష్ట్రాల‌ క్యాట‌గిరీలోనూ స‌ఫాయి మిత్ర సుర‌క్ష చాలెంజ్‌లో అవార్డు సాధించాం అని కేటీఆర్ చెప్పారు. స‌ఫాయి మిత్ర సుర‌క్ష ఛాలెంజ్‌లో టాప్ త్రీ టౌన్స్‌లో క‌రీంన‌గ‌ర్ కార్పొరేష‌న్‌కు అవార్డు వ‌చ్చింది. గార్బెజ్ ఫ్రీ సీటి కింద గ్రేట‌ర్ హైద‌రాబాద్‌ను గుర్తించారు. గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు స్వ‌చ్ఛ స‌ర్వేక్ష‌ణ్ అవార్డు కూడా వ‌చ్చింది. నిజాంపేట మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, ఇబ్ర‌హీంప‌ట్నం, సిరిసిల్ల‌, ఘ‌ట్‌కేస‌ర్‌, కోస్గి, హుస్నాబాద్, సిద్దిపేట మున్సిపాలిటీకి కూడా అవార్డులు వ‌చ్చాయి. కంటోన్మెంట్ విభాగంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు కూడా అవార్డు వ‌చ్చింది. ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం వ‌ల్లే ఈ అవార్డులు వ‌చ్చాయ‌న్నారు. తెలంగాణకు మొత్తం 12 అవార్డులు రావ‌డం సంతోషంగా ఉంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీల్లో ఇప్ప‌టికే 101 మున్సిపాలిటీల‌ను ఓడిఎఫ్ ప్ల‌స్ క్యాట‌గిరీలుగా కేంద్రం గుర్తించింది. 8 మున్సిపాలిటీల‌కు ఓడిఎఫ్ ప్ల‌స్ ప్ల‌స్ గుర్తింపు వ‌చ్చింది. హైద‌రాబాద్‌ను వాట‌ర్ ప్ల‌స్ సిటీగా కేంద్రం గుర్తించింది. స్ట్రీట్ వెండ‌ర్స్‌కు రుణాలను ఇవ్వ‌డంలో తెలంగాణ నంబ‌ర్‌వ‌న్‌గా నిలిచింది. ప్ర‌తీ విష‌యంలో తెలంగాణ అగ్ర‌గామిగా నిలుస్తుందంటే కేవ‌లం ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాలే అని స్ప‌ష్టం చేశారు. రూర‌ల్, అర్బ‌న్ డెవ‌ల‌ప్‌మెంట్ అద్భుతంగా జ‌రుగుతోంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

- Advertisement -