ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చడమే ప్రభుత్వ ధ్యేయం..

173
ktr minister
- Advertisement -

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, 129 సూరారం డివిజన్ పరిధిలోని ఐడిఏ జీడిమెట్ల ఫేస్ -4 లో జీహెచ్ఎంసీ మరియు ప్రైవేట్ భాగస్వామ్యం (రాంకీ) సంయుక్తంగా రూ.15 కోట్లతో ఏర్పాటు చేసిన సీ అండ్ డీ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ను ఈరోజు రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. శాస్త్రీయ పద్ధతిలో వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేసి గ్రీన్‌ అండ్‌ ఎకో ఫ్రెండ్లీగా తిరిగి వినియోగించుకునేలా దక్షిణ భారత దేశంలోనే అత్యాధునిక యంత్రాలతో ఏర్పాటు చేసిన సీ అండ్‌ ‌డీ వేస్ట్ రీసైక్లింగ్ ప్లాంట్ ను కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చేందుకు ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా కొత్త ప్రాజెక్టులను ప్రోత్సహిస్తుందని అన్నారు. హైదరాబాద్ నగరంలో రోజు రోజుకీ వేల మెట్రిక్ టన్నుల సీ అండ్ డీ వేస్ట్ వెలువడుతుందని, దీన్ని రీసైక్లింగ్ కు వినియోగించుకోవడంతో వేస్ట్‌ ప్రాసెసింగ్, ప్రొడక్షన్‌.. ఇలా రెండు విభాగాలుగా పనులు జరగడం ఆ తర్వాత రీసైక్లింగ్‌తో ఇటుకలు, పేవర్‌ బ్లాక్‌లు తయారు అయ్యేవిధంగా ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. వ్యర్థాలను క్రషింగ్‌ ద్వారా కంకరగా, కోర్, ఫైన్‌ ఇసుకగా తిరిగి మార్చేందుకు ఈ ప్లాంట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కంకరను రోడ్ల లెవెల్‌ ఫిల్లింగ్‌కు, ఇసుకను రోడ్డు పనుల్లో పీసీసీగా, ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులకు వివిధ రకాలుగా వాడొచ్చని అన్నారు.

బిల్డర్లు, ప్రజలు సీ&‌డీ వేస్ట్‌ను తరలించేందుకు జిహెచ్ఎంసి టోల్ ఫ్రీ – 180012007659 నంబర్‌కు ఫోన్‌ చేస్తే వాహనాలు మీ ప్రాంతానికే వచ్చి సాధారణ రుసుముతో వ్యర్థాలను ప్లాంట్ కు తరలించడం జరుగుతుందని కనుక ప్రజలు చైతన్యవంతులై ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములవ్వాలని మంత్రి కేటీఆర్ కోరారు. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే కేపి వివేకానంద్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ రాహుల్ రాజ్ ఐఎఎస్, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ మమత, రాంకీ సంస్థ ఎండి మరియు సీఈఓ గౌతం రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ మసూద్ మాలిక్, డిప్యూటీ కమిషనర్ రవీందర్ కుమార్, స్థానిక కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -