వరంగల్ మహానగరానికి మహర్ధశ..

453
- Advertisement -

వరంగల్ మహా నగరానికి మహర్ధశ రానుంది. హైదరాబాద్ తర్వాత అతిపెద్ద పట్టణంగా అభివృద్ధి చెందుతున్న కాకతీయ వారసత్వ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర పురపాలక, ఐటి శాఖ మంత్రి కేటి రామారావు ఆదేశాలు జారీ చేశారు. వరంగల్ మహానగరంలోని పెండింగ్ పనులు, భవిష్యత్ ప్రణాళికలపై నేడు అసెంబ్లీ కమిటీ హాల్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలతో మంత్రులు కేటిఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీమతి సత్యవతి రాథోడ్ లు సమీక్ష చేశారు.

ఎన్నో రోజులుగా కొనసాగుతున్న కాకతీయ అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(కుడా) మాస్టర్ ప్లాన్ కు బుధవారం కేటిఆర్ ఆమోదం తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లా నేతల సమక్షంలో మాస్టర్ ప్లాన్ ఫైల్ పై సంతకం పెట్టి…కుడా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను ఆమోదించారు. 2020 నుంచి 2041 వరకు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ మాస్టర్ ప్లాన్ తో వరంగల్ మహానగర రూపురేఖలు మారిపోతాయని, గొప్ప నగరాల జాబితాలో వరంగల్ చేరుతుందని మంత్రి కేటిఆర్ చెప్పడంతో మంత్రులు ఎర్రబెల్లి, శ్రీమతి సత్యవతితో పాటు ఉమ్మడి వరంగల్ నేతలంతా చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు.

ktr 1

వరంగల్ కు మంజూరైన 68 కిలోమీటర్ల రింగ్ రోడ్డులో 29 కిలోమీటర్ల రింగ్ రోడ్డు పనులు మే నెల చివరి నాటికి పూర్తి చేసి, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీ  నాటికి దీనిని ప్రారంభించాలని మంత్రి కేటిఆర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. వరంగల్ నగరంలో 15 కిలోమీటర్ల మేరకు మోనో రైలు ప్రతిపాదనలతో పాటు హైదరాబాద్ తరహాలో మెట్రో రైల్ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మామునూర్ ఎయిర్ పోర్టును అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా సూత్ర ప్రాయంగా అంగీకరించినట్లు మంత్రి కేటిఆర్ వెల్లడించారు.

 వరంగల్ స్మార్ట్ సిటీ పనులు ఎంతవరకు వచ్చాయని ప్రజా ప్రతినిధులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్మార్ట్ సిటీ పనుల్లో భాగంగా వెంటనే నగరంలో వెయ్యి పబ్లిక్ టాయిలెట్లు నిర్మించాలని, ఇవి కూడా ఈ దసరాలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం నగరంలో 250 పబ్లిక్ టాయిలెట్లు మాత్రమే ఉన్నాయని, మొదటగా ప్రభుత్వ స్థలాల్లో, కార్యాలయాల్లో వెయ్యి టాయిలెట్ల నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలన్నారు. ఇన్ సానిటరీ లాట్రిన్స్ లేకుండా పరిశుభ్రత పాటించాలన్నారు. పందుల నివారణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించి, పందుల పెంపకందార్లకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించాలన్నారు. ఇందులో ముఖ్యంగా ప్రజా ప్రతినిధులు జోక్యం చేసుకుని పందుల పెంపకందార్లను ఒప్పించాలన్నారు.

ktr 2

ముఖ్యమంత్రి కేసి ఆర్ గారు వరంగల్ కు వచ్చిన సందర్భంగా ఇచ్చిన హామీల అమలు వేగంగా పూర్తి చేయాలన్నారు. ఇందులో ముఖ్యంగా పేదల ఆత్మగౌరవ సూచికలైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు 3900 మంజూరు  చేశారని, వీటిని యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయాలన్నారు. ఇందులో ఇప్పటికే 900 ఇండ్లు పూర్తై ప్రారంభానికి సిద్ధంగా ఉన్న వాటిని త్వరలో ప్రారంభించాలని సూచించారు. మిగిలిన 3000 ఇండ్లలో 2200 ఇండ్ల నిర్మాణం కొనసాగుతోందని, కేవలం 800 ఇండ్ల నిర్మాణం కొన్ని స్థానిక ఇబ్బందుల వల్ల ప్రారంభం కాలేదని, మంత్రి కేటిఆర్ దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకురావడంతో అక్కడ ఇండ్లు ప్రారంభించలేని పరిస్థితి ఉంటే ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. దసరా నాటికి 3900 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి చేయాలని చెప్పారు. ప్రస్తుతం బడ్జెట్ లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి నిధుల లోటు లేనందున, వీటిపై ప్రత్యేక దృష్టి సారించి పనులు పూర్తి చేసేందుకు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కలిసి పనిచేయాలన్నారు.

కాళోజి కళాక్షేతం, ఏకశిలా పార్క్ నిర్మాణం, జంక్లన్ల అభివృద్ధి, రోడ్ల విస్తరణ పనులు కూడా వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా శానిటేషన్ ప్లాన్, గ్రీనరీ ప్లాన్ , ఎనర్జీ ఆడిట్ పూర్తి చేసి తీసుకురావాలన్నారు. ఎనర్జీ ఆడిట్ లో భాగంగా నగరంలో తుప్పు పట్టిన స్తంబాలు, వంగిన స్తంబాలు, వేలాడే వైర్లు, ప్రమాదకరంగా మారిన ట్రాన్స్ ఫార్మర్లను వెంటనే తీసేసి కొత్తవి ఏర్పాటు చేయాలన్నారు. నగరానికి మాస్టర్ ప్లాన్ మేరకు శానిటేషన్ ప్రణాళికలు సిద్ధం చేసి తీసుకురావాలన్నారు. బడ్జెట్ లో 10 శాతం పచ్చదనం అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న నేపథ్యంలో గ్రీనరీ ప్లాన్ రెడీ చేయాలన్నారు. ఉన్న స్మశాన వాటికలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం, కొత్త వాటికోసం స్థలాలు గుర్తించి నిర్మాణాలు ప్రారంభించాలన్నారు.

ప్రస్తుతం మడికొండలో మాత్రమే డంపింగ్ యార్డు ఉందని, వరంగల్ మహా నగరం మరింతగా అభివృద్ధి కానున్న నేపథ్యంలో నగరానికి నాలుగు వైపుల డంపింగ్ యార్డులు గుర్తించాలని కోరారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న డంపింగ్ యార్డులో అతి త్వరలో బయో మైనింగ్ కూడా ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ ప్రగతిలో ముఖ్యమంత్రి కార్పోరేషన్లో కలిసిన శివారు ప్రాంతాలకు మూడో వంతు నిధులు కేటాయించి ఖర్చు చేయాలని సిఎం కేసిఆర్ గారు ఆదేశించారని, కచ్చితంగా శివారు ప్రాంతాల అభివృద్ధి జరిగేటట్లు కార్పోరేషన్ బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ నెల 16వ తేదీన మరోసారి సమావేశమై ముఖ్యమైన అంశాల మీద చర్చిస్తామని, అధికారులు సమగ్ర సమాచారంతో సమావేశానికి రావాలన్నారు.

ఈ సమావేశంలో చీఫ్ విప్ వినయ్ భాస్కర్, మాజీ ఉప ముఖ్యమంత్రి, మండలి సభ్యులు కడియం శ్రీహరి, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి,  ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, పెద్ది సుదర్శన్ రెడ్డి నన్నపనేని నరేందర్, కుడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, జిడబ్ల్యు ఎంసి మేయర్ గుండా ప్రకాశ్ రావు, డిఎంఏ సత్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి, ఈఎన్సీలు గణపతి రెడ్డి, రవీందర్ రావు, మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, కుడా చీఫ్ ప్లానర్ అజిత్ రెడ్డి, ఇతర అధికారులు, నేతలు పాల్గొన్నారు.

- Advertisement -