రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా ఆయన పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంత్రి కేటీఆర్ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు.

అనంతరం మంత్రి మాట్లాడుతూ..ఈ మూడు నెలల పాటు ప్రణాళికబద్ధంగా కష్టపడి చదివి.. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని ఉద్యోగార్థులకు కేటీఆర్ సూచించారు. మొబైల్స్ వాడకాన్ని తగ్గించాలని పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థులకు కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు. జీవితం చాలా పెద్దది.. అపజయం ఎదురైనంత మాత్రాన కుంగిపోవద్దని చెప్పారు. నైపుణ్యం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ప్రైవేట్ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణలో ఎన్నో అద్భుతాలు సృష్టించామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.