100పైగా స్థానాలలో మెజారిటీ సాధిస్తాం- మంత్రి కొప్పుల

146
koppula
- Advertisement -

జిహెచ్ఎంసి ఎన్నికలలో టిఆర్ఎస్ కు ఘన విజయం చేకూర్చడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వినాయక్ నగర్ 137వ డివిజన్‌లో సన్నాహక సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. అలాగే వెంకటాపురం డివిజన్‌లో మంత్రి, పెద్దపల్లి ఎంపి వెంకటేష్ నేతతో కలిసి టిఆర్ఎస్ శ్రేణులతో ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. జిహెచ్ఎంసి ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలందరికి మరింత మేలు చేసేదిగా ఉంది. మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలను ప్రజలకు వివరించడం ద్వారా 100పైగా స్థానాలలో మంచి మెజారిటీ సాధిస్తామని ధీమాగా చెప్పారు. రజకుల ఇస్త్రీ షాపులు,ధోబీ ఘాట్లు,నాయి బ్రాహ్మణుల బార్బర్ షాపులకు విద్యుత్తును ఉచితంగా అందించాలనే నిర్ణయం హర్షణీయమని మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఇండ్లకు సరఫరా చేసే తాగునీటిని 20వేల లీటర్ల వరకు ఇకనుంచి ఉచితంగానే ఇవ్వనున్నాం. రేషన్ కార్డులు, పింఛన్లను మరింత మందికి ఇవ్వనున్నామని మంత్రి గుర్తు చేశారు.

అలాగే నగరంలో బస్తీ దవాఖాల సంఖ్యను పెంచడంతో పాటు నాణ్యమైన డయాగ్నొస్టిక్ సేవలు అందుబాటులోకి తెస్తాం. పేదలు, బాటసారులకు రుచికరమైన భోజనాన్ని 5రూపాయలకే అందించే అన్నపూర్ణ క్యాంటీన్లను మరికొన్ని తెరిచి కూర్చుని తినే ఏర్పాటు చేస్తామన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే పేదల కోసం ఏర్పాటు చేసిన నైట్ షెల్టర్ల సంఖ్యను పెంచుతాం. విజయవంతంగా నడుస్తున్న మెట్రోరైలు వ్యవస్థను రాయదుర్గం నుంచి శంషాబాద్ విమానాశ్రయం,మెహదీపట్నం నుంచి బిహెచ్ఇఎల్‌కు విస్తరించడం,మరిన్ని ఫ్లైఓవర్లు,స్కైవేలను నిర్మించడం ద్వారా ట్రాఫిక్ సజావుగా ముందుకు సాగే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

- Advertisement -