కేసీఆర్ ప్రకటనకు అనూహ్య స్పందన- జగదీష్ రెడ్డి

30
minister jagadish reddy
- Advertisement -

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ పార్టీలో, ప్రభుత్వాలో కాదని, ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. అందుకోసం యావత్ భారతదేశం ఎదురు చూస్తుందని ఆయన చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుధవారం మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా దివంగత కల్నల్ సంతోష్ బాబు విగ్రహ ఆవిష్కరణ జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ గా టీఆర్‌ఎస్ రూపాంతరం చెందడం ద్వారా పింక్ ఇండియాగా మరబోతుందన్న వ్యాఖ్యలపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఆయన స్పందిస్తూ ‘ఇప్పటి వరకు దేశ అవసరాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడ సరైన పునాదులు నిర్మించలేక పోయిందన్నారు. స్వతంత్ర పోరాటం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గానీ, ఆ తరువాత తామే ప్రత్యామ్నాయం అంటూ ఏర్పడ్డ రాజకీయ పార్టీల సమూహాలు కానీ, ఆ తరువాత కాలంలో గుజరాత్‌ను చూపించి దేశాన్ని ఉద్దరిస్తామంటూ అధికారంలోకీ వచ్చిన భారతీయ జనతా పార్టీలు వరుసగా వైఫల్యం చెందయాని మంత్రి విమర్శించారు.

ఈ పార్టీలు ఏవీ కుడా ప్రజల ఆకలి, మౌలిక సదుపాయాలు, సోకర్యాల కల్పనపై దృష్టి సారించలేక పోవడమే ఇందుకు కారణమని ఆయన స్పష్టం చేశారు. ప్రజల మధ్యన వైషమ్యాలు సృష్టించి లబ్ది పొందాలి అన్నది బిజెపి అభిమతం అయితే ప్రతిపక్ష పాత్రను కుడా నిర్వహించ లేని హీన దుస్థితికి కాంగ్రెస్ పార్టీ చేరుకుందని మంత్రి చెప్పారు. అటువంటి పరిస్థితుల నుండి బయట పడేందుకే దేశం ప్రత్యామ్నాయ పార్టీ కోసమో,ప్రభుత్వం కోసమో కాకుండా ప్రత్యామ్నాయ ఎజెండా కోసం ఎదురు చూస్తుందని ఆయన తెలిపారు. అటువంటి ఎజెండా ఆవశ్యకతను వెల్లడించినందునే ప్రస్తుతం యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్‌ను స్వాగతిస్తున్నారని మంత్ర జగదీష్‌ రెడ్డి చెప్పుకొచ్చారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా కేవలం ఎనిమిది సంవత్సరాల కాలంలోనే ప్రపంచ చిత్ర పటంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చిన మహానేత ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఆయన కొనియాడారు. అటువంటి నేత తీసుకున్న నిర్ణయాలతో తెలంగాణ రూపురేఖలు మారి పోయాయన్నారు. ఎటువంటి కొలమానాన్ని పెట్టి చూసినా ఒకటి నుండి 50 వరకు దేశంలో తెలంగాణయే నెంబర్ వన్ స్థానంలో కనిపిస్తుందని,అందుకే ప్రస్తుతం యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ వైపు చూస్తుందన్నారు. దేశానికి కావల్సిన ప్రత్యామ్నాయ ఎజెండా ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎప్పుడూ చరిత్ర నిర్మాతలేనని ఆయన తెలిపారు. అటువంటి ప్రజల అభీష్టానికి అనువైన ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ప్రకటిస్తారని మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు.

- Advertisement -