మూసికి డోకాలేదు..:మంత్రి జగదీష్ రెడ్డి

235
jagadish reddy
- Advertisement -

మూసి ఆయకట్టుకు ఎటువంటి పరిస్థితుల్లో డోకా ఉండబోదని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో చరిత్రలో ముందెన్నడూ లేనిరీతిలో ఒక్కసారిగా వరద ఉధృతి తీవ్రం కావడంతో  అప్పటికప్పుడు అదే రాత్రి సూర్యపేట, నల్గొండ జిల్లా కలెక్టర్ల  తోపాటు నీటిపారుదల అధికారులను ఆయన అప్రమత్తం చేశారు.

సూర్యపేట జిల్లా రత్నపురం వద్ద గండి పెట్టి నీటిని కిందికి వదలాలి అంటూ అధికారులను ఆదేశించారు.అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఆయకట్టు కింది ప్రజలను జాగ్రత్తగా ఉండాలి అంటూ విజ్ఞప్తి చేసారు.అయినా వరద ఉధృతి తగ్గకపోవడంతో శాసనమండలి సమావేశంలో ఉన్న ఆయన హుటాహుటిన మూసి ఆయకట్టు మీదకు చేరుకుని అత్యవసర ద్వారాలతో పాటు పూర్తిగా తలుపులు తీయించి 1.75 లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదలడంతో ఆయకట్టు రైతాంగం ఊపిరి పీల్చుకుంది.

ఈ సందర్భంగా మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చరిత్రలో ముందెన్నడూ ఊహించని రీతిలో వరద ఉధృతి మూసికి చేరిందన్నారు.రెండు లక్షల పై చిలుకు క్యూసెక్కుల నీటి ప్రవాహం ఒక్కసారి మూసికి చేరడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనదన్నారు.అయితే అధికారులు అప్రమత్తంగా ఉండడం తో అటు సూర్యపేట జిల్లా రత్నపురం వద్ద గండి పెట్టడం తో పాటు అత్యవసర తలుపులతో సహా అన్నింటినీ తెరువడంతో 1.73 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు.

హైదరాబాద్ నుండీ వస్తున్న వరద ఉధృతి తో పాటు బిక్కేరు నుండి వస్తున్న వరద ఉధృతిని అంచనా వేసేందుకు నీటిపారుదల అధికారులు ఇక్కడే ఉండి సమీక్షిస్తారని ఆయన తెలిపారు. అంతే గాకుండా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులను సమన్వయం చేసుకుని  నీటి ప్రవాహాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటారని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కాగా మంత్రి జగదీష్ రెడ్డి వెంట నల్గొండ జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి,నకిరేకల్ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య సూర్యపేట, నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు ఉన్నారు.

- Advertisement -