ఈటల బీజేపీలో చేరడం హాస్యాస్పదం: మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి

251
- Advertisement -

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌పై రాష్ట్ర విద్యుత్‌ శాఖ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి మండిపడ్డారు. ఆయన ఆదివారం సాయంత్రం టీఆర్ఎస్ఎల్పి ఆఫీస్ వద్ద ప్రెస్ మీట్ మాట్లాడారు. ఈటల రాజేందర్ బీజేపీలో చేరడం హాస్యాస్పదం. ఆయన చెబుతున్న దానికి చేస్తున్న దానికి పొంతన లేదు. రాజేందర్ హిట్లర్ వారసుల సరసన చేరారు. నేతి బీర కాయలో నేతి చందంగా ఉంది ఈటల రాజేందర్ వైఖరి. టీఆర్ఎస్‌లో ఆయనకు సమస్యలు పెద్దగా లేవు. కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమయ్యేవి అని మంత్రి విమర్శించారు. ప్రజలంతా వ్యతిరేకిస్తున్న పార్టీ బీజేపీ..మొన్నటి దాకా బీజేపీని తిట్టిన ఈటల ఇపుడు ఆ పార్టీ ఏం మారిందని చేరాడు ? అని మంత్రి ప్రశ్నించారు.

బీజేపీ అన్నింటా విఫలమయింది..మునిగి పోయే పడవలో ఈటల ఎక్కారు..ఆయనతో పాటు చేరే వారు కూడా మునిగి పోయేవారే అని మంత్రి ఎద్దేవ చేశారు. ఒక్క సంక్షేమ పథకం కూడా బీజేపీ తేలేదని..టీఆర్ఎస్ కన్నా బీజేపీ ఏ విధంగా మెరుగు? చెప్పాలని ప్రశ్నించారు.బీజేపీ ప్రజా వ్యతిరేక పార్టీ. హుజూరాబాద్ ప్రజలకు ఈటల ద్రోహం చేశారు..ఈటల బీజేపీలో చేరడంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి జగదీష్‌ రెడ్డి. ప్రతీ పార్టీలో అభిప్రాయ భేదాలు సహజం..ఈటలకు ముందు నుంచే ప్రత్యేక ఎజెండా ఉందని బీజేపీలో చేరడం ద్వారా అది రుజువైందన్నారు.. రాజేందర్ బీజేపీతో పాటే మునిగి పోతారు. హుజురాబాద్ ప్రజలు కెసిఆర్ వెంటే ఉన్నారు. డెబ్బయ్ సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని ఈ ఏడేళ్లలో కెసిఆర్ చేసి చూపించారు. తెలంగాణాలో ఇపుడు ఆకలి చావులు ,ఆత్మహత్యలు లేవు..2014కు ముందు పరిస్థితి ఎలా ఉంది ఇపుడు ఎలా ఉందో అందరికీ తెలుసు.. కోటి టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేసి తెలంగాణ పంజాబ్‌ను దాటిపోయింది. విద్యుత్‌లో తెలంగాణ గుజరాత్‌ను మించిపోయింది.

అన్ని రంగాల్లో కెసిఆర్ పాలనా దక్షతతో తెలంగాణ అగ్రభాగానా ఉంది. టీఆర్ఎస్‌ను వీడిన వాళ్ళే నష్టపోతారు పార్టీ కి ఏం కాదు…గుంపును వదిలి అడవిలోకి వెళితే సింహాల పాలు కావడమే..ఈటల తనపై విచారణ పూర్తి అయ్యేదాకా టీఆర్ఎస్‌లోనే ఉండాల్సింది అన్నారు. కొందరు శత్రువులు నాకు కూడా ఈటల గతి పడుతుందని కలలు కంటున్నారు..కానీ కలలో కూడా అది జరగదని జగదీష్‌ రెడ్డి స్పష్టం చేశారు. కాగా,భూముల అమ్మకం తెలంగాణ అభివృద్ధి కోసమే అని..ఎన్నికల కోసం టీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోదని..సంక్షేమం నిర్విరామంగా కొనసాగుతుందన్నారు. ఎన్నికల మేనిఫెస్టోను కచ్చితంగా అమలు చేస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆలోచనలకనుగుణంగా పాలన చేసే పార్టీ టీఆర్ఎస్ అని మంత్రి జగదీష్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు గాదరి కిషోర్,మల్లయ్య యాదవ్,పైలా శేఖర్ రెడ్డి,భాస్కర్ రావు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పాల్గొన్నారు.

- Advertisement -