తమిళిసై బీజేపీ నేతగా వస్తే మేమెందుకు ప్రోటోకాల్ ఇస్తాము..! ఆమె గవర్నర్ పదవిలో వస్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ప్రధాని మోదీతో సమావేశం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. సూర్యాపేటలో ఆయన ఈరోజు మీడియాతో మాట్లాడారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం గురుంచి గవర్నర్ ఢిల్లీలో అలా కామెంట్ చేయాల్సిన అవసరం లేదన్నారు.
తమిళిసై గవర్నర్ పదవిలో వస్తే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. కానీ గవర్నర్ పదవిని అడ్డం పెట్టుకుని బీజేపీ నాయకురాలిగా వస్తే మాత్రమే సమస్య అని మంత్రి స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగానే బడ్జెట్ సమావేశాలు నిర్వహించామని తెలిపారు. తమ వైపు నుంచి గవర్నర్కు ఎలాంటి సమస్య లేదు. రాజ్యాంగ పదవుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందన్నారు. ప్రోటోకాల్ విషయంలో లోపాలపై ఎప్పుడు స్పందించని గవర్నర్ ఇప్పుడెందుకు స్పందిస్తున్నారని మంత్రి ప్రశ్నించారు.
ఎవరినైనా గౌరవించడంలో సీఎం కేసీఆర్ను మించిన వారు ఎవరు లేరు. ఉద్యమం సమయంలో తెలంగాణ వ్యతిరేక ముద్రపడిన నరసింహన్తో రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా సఖ్యతగా ఉన్నామని గుర్తు చేశారు. రాజ్యంగంలో రాజకీయాలకు అతీతంగా ఉండేవాళ్ళని గవర్నర్లుగా నియమించాలని ఉంది. కానీ ఇప్పుడు మాజీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులను, సీఎంలను, మంత్రులను గవర్నర్లుగా ఎలా నియమిస్తారు? అని ప్రశ్నించారు మంత్రి జగదీశ్ రెడ్డి.