నిరాడంబ‌రంగా శ్రీరామ‌ న‌వ‌మి వేడుక‌లు: మంత్రి అల్లోల

165
Minister Indrakaran Reddy
- Advertisement -

రాష్ట్రంలో మ‌రోసారి క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఈ సారి కూడా భద్రాద్రిలో శ్రీరామ‌ న‌వ‌మి వేడుక‌లను నిరాడంబ‌రంగా నిర్వహించాల‌ని తెలంగాణ‌ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. తెలంగాణ‌ మంత్రి అల్లోల ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. గ‌త ఏడాది నిర్వహించిన‌ట్లుగానే కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా శ్రీరామ‌న‌వ‌మి వేడుక‌ను జ‌రుపుతామని తెలిపారు. కొద్ది రోజులుగా పెరుగుతున్న క‌రోనా కేసులను క‌ట్టడి చేయడానికి అన్ని ‌మ‌తాల పండుగ‌ల నిర్వహ‌ణ‌పై ప్రభుత్వం ఆంక్షలు విధించిన విషయం తేలిసిందే. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

సీతారామ కల్యాణాన్ని చూడ‌డానికి భక్తులెవరూ భద్రాద్రికి రావద్దని మంత్రి చెప్పారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా భక్తుల రాకపై ఆంక్షలు విధించినట్లు తెలిపారు. వేడుకలను ప్రత్యక్ష ప్రసారం ద్వారా టీవీల్లో చూడాల‌ని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, భక్తులు పరిస్థితిని అర్థం చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఇక ఆన్‌లైన్‌లో ఇప్ప‌టికే క‌ల్యాణ‌ టిక్కెట్లు బుక్ చేసుకున్న భ‌క్తులకు ఆ డ‌బ్బులను తిరిగి చెల్లిస్తామ‌ని వివ‌రించారు. అంతేగాక‌, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రామాల‌యాల్లో కొవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగానే భ‌క్తుల‌కు ద‌ర్శనాలు క‌ల్పిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. వైరస్‌ విజృంభణ కారణంగా ఆలయంలో నిబంధనలను పక్కాగా అమలు చేయాల‌ని దేవాదాయ శాఖ అధికారుల‌ను ఆదేశించారు.

- Advertisement -