అప‌త్కాలంలో అండ‌గా క్లిమామ్ సేవలు..

211
- Advertisement -

క‌రోనా బాధిత కుటుంబాల‌కు`ఆప‌ద‌లో తోడుగా క్లిమామ్ నిలుస్తోంది. హైద‌రాబాద్ లోని ప్ర‌ధాన ఆసుప‌త్రుల వ‌ద్ద క‌రోనా బాధిత కుటుంబాల‌కు అన్న‌దానం నిర్వ‌హించి పెద్ద మ‌న‌సు చాటుకుంటుంది. లాక్ డౌన్ వ‌ల్ల హోటళ్లు, రెస్టారెంట్‌లు లేకపోవటంతో కరోనా బాధిత సహాయకుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని వారికి క్లిమామ్ భోజన సౌకర్యాన్ని కల్పిస్తుంది. గత కొన్ని రోజులుగా పలు హాస్పిటల్స్ వద్ద కరోనా బాధిత సహాయకులకు అన్న‌దానం చేశారు. ఇవాళ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి భోజనాన్ని పరిశీలించి, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఫుడ్ ప్యాకింగ్ చేశారు. ఈ కార్యక్ర‌మంలో క్లిమామ్ వ్య‌వ‌స్థాప‌కురాలు అల్లోల దివ్యారెడ్డి, టీఆర్ఎస్ యువ‌జ‌న నాయ‌కులు అల్లోల గౌతంరెడ్డి, క్లిమామ్ టీం పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా క్లిమామ్ ఫౌండ‌ర్ అల్లోల దివ్యారెడ్డి మాట్లాడుతూ.. భారతీయ సంప్రదాయంలోనే తరతరాలుగా ‘వసుధైక కుటుంబం’అనే భావన ఉందన్నారు. దీని అర్థం ప్రపంచం అంతా ఒక కుటుంబమ‌ని పేర్కొన్నారు. క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో వసుధైవ కుటుంబ భావనతో బాధితుల‌కు తోడుగా నిలవడం క‌ర్త‌వ్యంగా భావించి సేవ చేస్తున్నామ‌ని తెలిపారు. అందులో భాగంగానే కరోనా సోకి దవాఖానలో చేరి చికిత్స పొందుతున్న వారి కుటుంబ సభ్యులకు నిత్యం అన్నదానం చేస్తున్న‌ట్లు చెప్పారు. కొవిడ్‌ సంక్షోభంలో కరోనా సోకి దవాఖానకు వైద్యం కోసం వచ్చే వారు అన్నం లేక అల్లాడొద్దనే ఉద్దేశంతో వారి సహాయకులకు ఉచిత భోజన సౌకర్యం కల్పించినట్లు వెల్ల‌డించారు. ఈ అన్నదాన కార్యక్రమం మ‌రికొన్ని రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు.

మూగజీవాలకు పండ్లు అందజేత..
అల్లోల దివ్యారెడ్డి పేదలకు అన్నదానం చేయడంతో పాటు నగర శివారులో మూగ జీవాల ఆకలి తీర్చారు. లాక్ డౌన్ లో జనాలు బయటికి రాకపోవడంతో మూగజీవాలకు ఏటువంటి ఆహారం అందక ఆకలితో అలమటిస్తున్న మూగ జీవాల ఆకలి తీర్చేందుకు దివ్యారెడ్డి పండ్లను అందించారు. మూగజీవాల పట్ల జాలితో వ్యవహరించాలని, ఆకలి, దప్పిక తీర్చి వాటి ప్రాణాలు కాపాడాలని ఈ సందర్భంగా కోరారు..

- Advertisement -