బీజేపీతో అచ్చేదిన్‌ కాదు.. సచ్చే దిన్‌- మంత్రి హరీష్‌

91
- Advertisement -

గురువారం కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం దేశాయిపల్లిలో టీఆర్‌ఎస్‌ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్ర‌జ‌లంద‌రి స‌హ‌కారంతో గెల్లు శ్రీనును.. గెలుపు శ్రీనుగా సీఎం కేసీఆర్‌కు కానుక‌గా ఇద్దామ‌న్నారు మంత్రి హరీష్‌. బీజేపీ ఏం చెప్పి హుజూరాబాద్‌ ప్రజలను ఓట్లు అడుగుతుందన్నారు. బీజేపీ వ్యవస్థలను కూలదోస్తుందని, రోడ్డు మార్గాలు, నౌకశ్రయాలను, రైల్వేలను కుదవ పెడుతోందని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వంతో అచ్చేదిన్‌ కాదు.. సచ్చే దిన్‌ వచ్చిందని అనే ఎద్దేవా చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం తప్ప కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. బీజేపీ అమ్మకానికి… టీఆర్‌ఎస్‌ నమ్మకానికి మరో రూపమన్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అసహనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. టీఆర్‌ఎస్‌ నాయకులంతా హుజూరాబాద్‌కు వచ్చి ప్రచారం చేస్తున్నారని ఈటల అనడం సరికాదన్నారు. పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా ప్రచారం చేయవచ్చని హరీష్‌రావు అన్నారు.

రాబోయే ఉప ఎన్నిక‌లో బీజేపీకి డిపాజిట్ ద‌క్కకుండా చేయాల‌న్నారు. హుజూరాబాద్‌కు బీజేపీ చేసిందేమీ లేద‌న్నారు. వీణ‌వంక మండ‌లంలోని ఏ గ్రామానికి కూడా బండి సంజ‌య్ రూ. 10 ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌లేదు. ద‌త్త‌త తీసుకున్న రామ‌కృష్ణాపూర్‌కు బండి రూపాయి ప‌ని కూడా చేయ‌లేదు అని మంత్రి హ‌రీష్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

ఈ సమావేశంలో హ‌రీశ్‌రావుతో పాటు ఎమ్మెల్యేలు దాస‌రి మ‌నోహ‌ర్ రెడ్డి, పెద్ది సుద‌ర్శ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ నారదాసు ల‌క్ష్మ‌ణ్ రావు, జ‌డ్పీ చైర్‌ప‌ర్స‌న్ విజ‌య‌, పాడి కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీనివాస్ యాద‌వ్ పాల్గొన్నారు. మంత్రి హ‌రీశ్‌రావు స‌మ‌క్షంలో వైస్ ఎంపీపీ ల‌త స‌హా ప‌లువురు కార్య‌క‌ర్త‌లు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.

- Advertisement -