సకాలంలో పంటరుణాలు అందించాలి- మంత్రి హరీష్

214
Minister Harish Rao
- Advertisement -

తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సకాలంలో పంటరుణాలు అందేలా బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి టి. హరీష్ రావు బ్యాంకర్లను కోరారు. సోమవారం బి.ఆర్. కె.ఆర్ భవన్‌లో SLBC 29వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి 1,86,035.60 కోట్లతో Annual Credit Plan ను ఆమోదించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నాయకత్వంలో ప్రభుత్వం రైతు సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత నిస్తున్నదని, ఒక వారంలో దాదాపు 61 లక్షల మంది పైగా రైతుల ఖాతాలలో 7360 కోట్లు పైగా జమ చేశామని తెలిపారు. రైతు బంధు ద్వారా ప్రభుత్వం అందించిన సహాయంతో ఇతర రుణాలకు మళ్లించకుండా వారి సేవింగ్ అకౌంట్లలో జమ చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలు జారీచేశారని, బ్యాంకులకు ఈ ఆదేశాల అమలుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

బ్యాంకర్లు పంటరుణాలను సకాలంలో జాప్యం లేకుండా వారికి అందేలా చూడాలని మంత్రి కోరారు. తద్వారా రైతులు ఎరువులు, విత్తనాలు, ఇతర అవసరాలకు వినియోగిస్తారన్నారు. కోవిడ్ సమయంలో బ్యాంకర్లు తమ సేవలు అందించాయని, బ్యాంకింగ్ సిబ్బందికందరికి వ్యాక్సినేషన్ కు చర్యలు తీసుకున్నామని తెలిపారు. చిన్న చిన్న వ్యాపారస్తులకు మరింత ముద్రా రుణాలను అందించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్, తృణధాన్యాలు తదితర పంటల సాగును ప్రోత్సహిస్తుందన్నారు. స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల నిర్మాణాన్ని వేగవంతం చేసిందని బ్యాంకర్లకు తెలిపారు.

ఈ సమావేశంలో జహీరాబాద్ ఎంపి బిబి పాటిల్, ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానీయా, ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రోనాల్డ్ రోస్, SLBC ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ మిశ్రా, ఆర్.బి.ఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డ్ సిజిఎం వై. కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -