ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి జేబులు గుళ్ల చేసుకోవద్దు- మంత్రి హరీష్‌

67
- Advertisement -

మంగళవారం మంత్రి హరీష్‌ రావు మహబూబ్ నగర్ జిల్లా, బాలానగర్‌లో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కరోనా కష్ట కాలంలో ఉపయోపడుతుందని ఈ ఆసుపత్రిని ప్రారంభించాం. డాక్టర్ లక్ష్మారెడ్డి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి 2 కోట్ల 20 లక్షలతో 30 పడకల ఆసుపత్రిని నిర్మించారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి చాలా బాగా పని చేశారు. తెలంగాణ రాకముందు మహబూబ్ నగర్ జిల్లాలో ఐసీయూలు, డయాలసిస్ కేంద్రాలు లేవు. కేసీఆర్ నాయకత్వంలో లక్ష్మారెడ్డి చాలా మంచి కార్యక్రమాలు తీసుకున్నరు. కేసీఆర్ కిట్, కంటి వెలుగులు, పార్థీవ వాహనం, మహబూబ్ నగర్ మెడికల్ కాలేజి ఇలా చాల మంచి పనులు చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో మంచి పేరు పొందారు. ఇంతకుముందు చాలా మంది మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా ఏళ్లు పని చేశారు. బీజేపీ నుండి ఎంపీగా ఉన్నారు. మోదీ కూడా మహబూబ్ నగర్ జిల్లాలో ప్రచారం చేశారు. వలసల జిల్లాగా టీడీపీ, కాంగ్రెస్ పాలనలో పేరు వచ్చింది. ఇది వారిచ్చిన ఘనత అని మంత్రి ఎద్దేవ చశారు.

కేసీఆర్ హయంలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి కల్వకుర్తి నీళ్లు జడ్చర్ల దాకా తీసుకెళ్లాం. నెట్టెంపాడు, కోయిల్ సాగర్, బీమా ప్రాజెక్టులు పూర్తి చేసి జిల్లాకు నీరు ఇ్వవగలిగాం. చెక్ డ్యాంలు, మిషన్ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేశాం. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క మెడికల్ కాలేజి ఉందా.. అలాంటిది కేసీఆర్ 3 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. 450 కోట్లతో మహబూబ్ నగర్ మెడికల్ కాలేజికి 9 నెలల్లో అనుమతులు తెచ్చారు. అలాగే 510 కోట్లతో వనపర్తిలో మెడికల్ కాలేజి కడుతున్నారు. నాగర్ కర్నూలులో 510 కోట్లతో మరో మెడికల్ కాలేజి కడుతున్నారు. ఇదే కేంద్రం, బీజేపీ ప్రభుత్వం దేశంలో 157 కాలేజీలు ఇచ్చింది. కాని ఒక్క మెడికల్ కాలేజి తెలంగాణకు ఇవ్వలేదు. వారు ఇవ్వకపోయినా మన సీఎం కేసీఆర్ 17 మెడికల్ కాలేజీలు తెలంగాణలో మంజూరు చేశారు. 8 మెడికల్ కాలేజీలు ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించనున్నాం. 1500 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీల కోసమే మహబూబ్ నగర్ జిల్లాకు మంజూరు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది అని మంత్రి కొనియాడారు.

ఈ మధ్యే శ్రీనివాస్ గౌడ్ కొత్త ఆసుపత్రి 900 పడకలతో నిర్మించాలని సీఎం దగ్గర కోరారు. సీఎం 200 కోట్లతో ఆసుపత్రికి మంజూరు చేశారు. కొద్ది రోజుల్లోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 900 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి. ఎందుకు ఒక్క కాలేజీ తెలంగాణకు ఇవ్వలేదు. నీతి ఆయోగ్ మొన్ననే వైద్య ఆరోగ్య శాఖ పనితీరు మీద ఓ నివేదిక ఇచ్చారు. వైద్య సేవలు రాష్ట్రాల్లో ఎలా అందుతున్నాయని నివేదికలో పేర్కొన్నారు. తెలంగాణ టాప్ 3 లో ఉన్నాం. తమిళనాడు, కేరళ, తర్వాత తెలంగాణ ఉంది. ఇంతకు ముందు మనం ఎక్కడో ఉన్నాం. చివరలో ఉన్న రాష్ట్రం యూపీ. డబుల్ ఇంజన్ గ్రోత్ అంటారు. యోగీ యూపీ ముఖ్యమంత్రి, వారణాసి నుండి మోదీ అదే రాష్ట్రం నుంచి ఎంపీ. వైద్య సేవలు అందించడంలో యూపీ అన్ని రాష్ట్రాల కన్నా లాస్ట్. ఇది మేం చెప్పామా. నీతి ఆయోగ్ రిపోర్ట్ ఇచ్చింది అన్నారు.

ఢిల్లీలో, రాష్ట్రంలో ఒకటే ప్రభుత్వం ఉంటే బాగా అభివృద్ధి జరుగుతుంది అని చెబుతున్నారు. అది ఏంటంటే వైద్యంలో లాస్ట్. ఇంకో గొప్ప నిర్ణయం నిన్న సీఎం తీసుకున్నారు. గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. రానున్న రోజుల్లో ఎల్ కేజీ, యూకేజీ కూడా ఏదో రీతిలో ప్రభుత్వ రంగంలో స్టార్ట్ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. మన ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్థాయి స్కూళ్లలాగా తయారు చేయాలని 7289 కోట్లతో మన ఊరు- మన బడి కార్యక్రమం ద్వారా రూపుదిద్దనున్నాం. అన్ని పాఠశాలలను అభివృద్ది చేయనున్నాం. వాష్ రూం, మంచి నీటి సౌకర్యం, డిజిటల్ క్లాస్ రూం, డ్యూయల్ డెస్క్ లు ఏర్పాటు చేయనున్నాం. విద్యలో, వైద్యంలో, సాగు నీటి రంగంలో, విద్యుత్ రంగంలో ఎంతో అభివృద్ది సాధించాం. కరెంటులో దేశంలోనే మనం మొదటి స్థానంలో ఉన్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నెంబర్ వన్, తలసరి ఆదాయంలో దక్షిణ భారత దేశంలో నెంబర్ వన్ గా ఉన్నాం అని మంత్రి తెలిపారు.

బీజేపీవి మాటలు తప్ప, చేతల్లో లేరు. గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు. దాన్ని తిప్పికొట్టాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు. కాగా, ట్రామాకెర్ సెంటర్ ఇక్కడ కావాలని, ఆక్సిడెంట్స్ జరిగితే వెంటనే ప్రాణాలు కాపాడేందుకు ఉపయోగపడుతుందని కోరారు. ట్రామా కేర్ సెంటర్ మంజూరు చేస్తాం. నవాబు పేటలో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఉంది. పడకలు పెంచాలని, డాక్టర్లు పెంచాలని కోరారు. తప్పకుండా ఆసుపత్రి స్థాయి పెంచుతామన్నారు. కరోనా సమయంలో మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. మీరు ధరించండి. మీ గ్రామంలో అందరూ ధరించేలా చర్యలు తీసుకోండి అని సూచించారు. వాక్సిన్ మొదటి డోస్ 100 శాతం పూర్తయింది. రెండో డోసు కొద్దిగా మిగిలింది. దాన్ని వంద శాతం పూర్తి చేయాలి. ప్రజాప్రతినిధులు సహాయం చేసి వైద్య సిబ్బందితో రెండో డోసు 100 శాతం పూర్తి చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ డ్రైవ్ చేసి పూర్తి చేయాలి. 15-17 ఏళ్ల వయసు వారికి వాక్సిన్ వేస్తున్నాం. పిల్లలు గ్రామాల్లో ఉన్నారు. అందరికీ వాక్సిన్ వేయించాలి. 60 ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు ఇస్తున్నాం. అందరు వృద్ధులూ తీసుకోవాలని మంత్రి కోరారు.

ఓమైక్రాన్ వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ. పాజిటీవ్ రాగానే ప్రయివేటు ఆస్పత్రుల్లో చేరి జేబులు గుళ్ల చేసుకోవద్దు. ఆందోళనకు గురవవద్దు. కాక్ టైల్ ఇంజెక్షన్లు అని ప్రజల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంది. 2 కోట్ల టెస్టింగ్ కిట్స్, కోటి హోం ఐసోలేషన్ కిట్స్ అందుబాటులో ఉంచాం. వా టిని వాడితే వంద శాతం నయం అవుతుంది. ఆశా వర్కర్లు రోజు వచ్చి పరీక్షలు చేస్తారు. వ్యాధి లక్షణాలు ఉంటే వారే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స ఇస్తారు. అక్కడ 2 లక్షల 50 వేల రెమిడెసివర్ ఇంజక్షన్లు ఉన్నాయి. ఆక్సిజన్ సౌకర్యం ఉంది. సర్పంచ్ లు, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ వైద్య సౌకర్యాలు వాడేలా ప్రోత్సహించండి. ఫిబ్రవరి నెలాఖరు, మార్చి మొదటి వారం వరకు కేసులు పెరిగే అవకాశం ఉంది. గర్భిణీ స్త్రీలకు కరనా వస్తే భయపడిపోతున్నారు. వారికి ప్రత్యేకంగా వార్డులు, ఆపరేషన్ ధియెటర్లు ఏర్పాటు చేశాం. వారికి ఇబ్బంది కలగకుండా కాన్పు చేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు ప్రజల్లో చైతన్యం పెంచండి. చాలా మంది డాక్టర్లకు, స్ఠాఫ్ నర్సులు, ఎం.ఎన్ఎం లకు పాజిటీవ్ వస్తోంది. అయినా ధైర్యంగా పని చేస్తున్నారు. వారి సేవలు వాడుకోండి. ఈ రెండు మూడు వారాలు కీలకం. ప్రజల్ని ఈ రెండు మూడు వారాలు కాపాడుకోవాలి అని మంత్రి హరీష్ రావు సూచించారు.

- Advertisement -