నీటి వాటాలపై ఇకనైనా కేంద్రం స్పందించాలి- మంత్రి హరీష్‌

97
harish-rao
- Advertisement -

ఏపీ, తెలంగాణ మ‌ధ్య జ‌లాల పంపిణీపై కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి తెలంగాణ సీఎం కేసీఆరేనంటూ గురువారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. దీనిపై శుక్రవారం మంత్రి హరీష్‌ రావు స్పందించారు. మంత్రి హరీష్‌ మీడియాతో మాట్లాడుతూ.. తాము కేంద్రమంత్రి షెకావత్‌ను వ్యక్తిగతంగా ఏమీ అనడంలేదని, రాష్ట్ర ప్రయోజనాల రీత్యానే తాము ఆవేదన వెలిబుచ్చుతున్నామని స్పష్టం చేశారు. ట్రైబ్యునల్ అంశం నాలుగు నెలల నుంచే పెండింగ్ లో ఉందని షెకావత్ చెబుతున్నారని, వాస్తవానికి ఇది నాలుగు నెలల నుంచి కాదని ఏడేళ్ల నుంచి పెండింగ్ లో ఉందని స్పష్టం చేశారు. తాము చట్టవిరుద్ధమైన రీతిలో వ్యవహరించడం లేదని, రాజ్యాంగబద్ధంగా తమకు రావాల్సిన నీటి వాటానే కోరుతున్నామని అన్నారు.

కేంద్రంతో టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి ఎలాంటి వ్య‌క్తిగ‌త పంచాయ‌తీ లేదు. మా స‌మ‌స్య‌.. మా నీళ్లు మాకు ద‌క్కాలి.. తెలంగాణ ఉద్య‌మం జ‌రిగిందే నీళ్లు, నిధులు నియామ‌కాల మీద. నీళ్ల విష‌యంలో ఏడేండ్ల నుంచి కేంద్రం తెలంగాణ‌కు స‌హ‌క‌రించ‌డం లేదు అని ఆర్థిక మంత్రి హ‌రీష్‌ రావు తెలిపారు. అక్ర‌మంగా ఏపీ ప్ర‌భుత్వం పెన్నా బేసిన్‌కు కృష్ణా జ‌లాల‌ను తీసుకెళ్తుంది. కృష్ణా జ‌లాల్లో మాకు న్యాయ‌మైన వాటా రావ‌డం లేదు. కృష్ణా బేసిన్‌లో మా నీటి వాటా మాకు కావాలంటే కొత్త ట్రైబ్యున‌ల్ ఏర్పాటు చేయాలి. సుప్రీంకోర్టులో దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను ఉప‌సంహ‌రించుకున్నాం. ఇప్పుడు ఎలాంటి అడ్డంకులు లేవు కాబ‌ట్టి త‌క్ష‌ణ‌మే ట్రైబ్యున‌ల్ ఏర్పాటుకు నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేంద్రాన్ని కోరుతున్నామ‌ని హ‌రీష్‌ రావు పేర్కొన్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అంతర్రాష్ట్ర నదీజలాల అంశంపై కేంద్రానికి ఫిర్యాదు చేశామని, ఫిర్యాదు చేసిన సంవత్సరంలోపే సమస్య పరిష్కరించాలని చట్టంలో ఉన్నా, ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని హరీష్‌ ఆరోపించారు. “సమస్య పరిష్కారం కాకపోతే ట్రైబ్యునల్ కు నివేదించాలి. కానీ సంవత్సరం పాటు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందువల్లే మేం 2015లో సుప్రీంకోర్టును ఆశ్రయించాం. కేంద్రం నిర్ణయం తీసుకోవడానికి సుప్రీంకోర్టులో కేసు ఎలాంటి ఇబ్బందులు కలిగించదు. అసలు కేంద్రం నిర్ణయం తీసుకోకపోవడం వల్లే కదా మేం సుప్రీంకోర్టుకు వెళ్లింది? కేంద్రం నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలనే సుప్రీంకోర్టును కోరాం. ఇకనైనా కేంద్రం స్పందించాలన్నదే మా ఆకాంక్ష. నీటి వాటాలకు సంబంధించిన అంశాన్ని ఇప్పుడున్న బ్రిజేశ్ ట్రైబ్యునల్ కు అనుసంధానం చేయడమో లేక కొత్త ట్రైబ్యునల్ ప్రకటించడమో చేయాలి” అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

- Advertisement -