ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వం పూర్తిగా అండ‌గా ఉంది- మంత్రి గంగుల

142
Minister Gangula
- Advertisement -

ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వ్యాప్తంగా క‌రోనా క‌ట్ట‌డికోసం ప్ర‌భుత్వం తీవ్రంగా శ్ర‌మిస్తుంది, క‌రోనా భాదితులకు అందే సేవ‌ల‌పై నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తుందని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. గురువారం క‌రీంన‌గ‌ర్ క‌లెక్ట‌ర్ అధ్య‌క్ష‌త‌న క‌లెక్ట‌రేట్ స‌మావేశ మందిరంలో అత్యున్న‌త స్థాయి స‌మీక్ష నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు సుంకె ర‌విశంక‌ర్, ర‌స‌మ‌యి బాల‌కిష‌న్, ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి, క‌లెక్ట‌ర్ శ‌శాంక‌, సీపి క‌మ‌లాస‌న్ రెడ్డితో పాటు ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. హోమ్ ఐసోలేష‌న్లో ఉంటున్న వారితో పాటు వివిద ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌పై మంత్రి స‌మ‌గ్రంగా చ‌ర్చించారు. ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. లాక్‌డౌన్ అమ‌ల‌వుతున్న తీరు సంతృప్తికరం, నిత్యావ‌స‌రాల వాహ‌నాల‌కు అనుమ‌తి ఉంది, అత్య‌వ‌స‌ర‌మైతేనే ప్ర‌జ‌లు భ‌య‌ట‌కు రావాలి, ప్ర‌భుత్వ యంత్రాంగంతో స‌హ‌క‌రించాలి అన్నారు.

ప్ర‌స్తుతం ఉమ్మడి క‌రీంన‌గ‌ర్లో 11,523 ఆక్టివ్ కేసుల‌కు 9911మంది హోమ్ ఐసోలేష‌న్లో కొలుకుంటున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ 776 బృందాల‌తో 2ల‌క్ష‌ల 60వేల ఇండ్ల‌లో జ్వ‌ర స‌ర్వేపూర్త‌యింది. ల‌క్ష‌ణాలు ఉన్న దాదాపు 6000 వేల మందికి కిట్లు అందించి అవ‌స‌ర‌మైన‌ మందుల‌తో చికిత్స‌లు అందిస్తున్నాం. ఇప్ప‌టికే 2,18,463 మందికి వాక్సినేష‌న్ పూర్తయింది. జిల్లాలో అవ‌స‌ర‌మైన మేర మందులు, ఆక్సీజ‌న్ అందుబాటులో ఉంది. గ‌తంలో జిల్లా ఆసుప‌త్రిలో ప్రారంభించిన ఆక్సీజ‌న్ ఉత్ప‌త్తియంత్రంతో పాటు అన్నిర‌కాలుగా ఆక్సీజ‌న్‌ను తెప్పించుకొని కొర‌త‌లేకుండా చూసుకుంటున్నామన్నారు.

రాష్ట్ర‌వ్యాప్తంగా టాస్క్ పోర్స్ ఏర్పాటు చేసిన‌ట్టుగానే, జిల్లాలో సైతం ప్ర‌త్యేక విభాగం ద్వారా ఏ హాస్పిట‌ల్‌కు ఎన్ని రెమిడెసివీర్, టోసిలిజుమాబ్ ఇత‌ర అత్య‌వ‌స‌ర మందులు కేటాయించాం, ఏ హాస్పిట‌ల్‌కు ఎంత ఆక్సీజ‌న్ పోతుంద‌నేది ప‌ర్య‌వేక్షించ‌డమే కాక వీటి ప్రస్థుత స్టాక్, ఎవ‌రికి వాడారు వంటి వివ‌రాల‌తో డాష్ బోర్డు ఏర్పాటు చేయాల‌ని క‌లెక్ట‌ర్‌ను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రిల‌తో పాటు ప్రైవేటులోనూ రెమిడిసివర్ ఇంజెక్షన్ లకు ఎలాంటి కొరత లేదు, ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉన్నాయి. ప్ర‌జ‌లెవ‌రూ ఆందోళ‌న‌కు గుర‌య్యి ప్ర‌యివేటు ఆస్పత్రుల‌కు ప‌రుగెత్తొద్దని సూచించారు. నగరంలోని 31 ప్రయివేటు ఆస్పత్రిలకు రేమిడిసివర్ ఇంజెక్షన్ లు సరఫరా అవుతున్నాయి. ఈ ఆప‌త్ స‌మ‌యంలో ప్రయివేటు ఆస్పత్రులు సైతం మానవత్వంతో వ్యవహరించాలి.

నిబంధనలకు విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తున్న నగరంలోని ప్రయివేటు ఆసుపత్రులపై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకునేలా ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం. ఈ క‌మిటీ ప్రైవేటు హాస్పిటళ్ల‌లోని ఫీజులు, మందుల, బెడ్ల‌ బ్లాక్ దందాల‌పై ప‌ర్య‌వేక్ష‌ణ చేస్తుంది. ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్రైవేట్‌ డయోగ్నస్టిక్ సెంటర్లతో మాట్లాడి 2500 లకే చెస్ట్ స్కాన్ తీసే విధంగా చొరవ తీసుకుందని మంత్రి పేర్కొన్నారు. గ‌తంలో సైతం క‌రీంన‌గ‌ర్లో ఇండోనేషియా కేసులు పెరిగిన స‌మ‌యంలో ప్ర‌తీ ప్ర‌జా ప్ర‌తినిధి ఎలా ప‌నిచేసి ప‌టిష్టంగా క‌ట్ట‌డి చేశామో అదేవిదంగా ప్ర‌స్తుతం సైతం మంత్రులు మెద‌లు, ఎమ్మెల్యేలు, మేయ‌రు, స్థానిక ప్ర‌జా ప్ర‌తినిదులు, కార్పోరేట‌ర్లు నిత్యం ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటారు, ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం కలిగే విధంగా అధికారులు సేవలు అందించాలి. ప్ర‌జ‌లు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ అధైర్య ప‌డ‌కూడ‌దు ప్ర‌భుత్వం పూర్తిగా అండ‌గా ఉంది అని మంత్రి గంగుల తెలిపారు.

- Advertisement -