ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి: మంత్రి ఈటెల

283
Minister Etela Rajender On Coronavirus
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటుంది అని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.భారత ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపు ఇచ్చిన నేపధ్యంలో రాష్ట్రంలోకి పెద్ద ఎత్తున వలస కార్మికులు, ప్రయాణీకులు వస్తున్నారు కాబట్టి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారని మంత్రి తెలిపారు. మొదట విదేశాల నుండి వచ్చిన వారివల్ల, తరువాత మర్కజ్‌తో వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరిగింది. ఇప్పుడు మైగ్రంట్స్ వల్ల ఆ ప్రమాదం ఉంది అని మంత్రి అభిప్రాయపడ్డారు.

విదేశాల నుండి విమానాల ద్వారా వస్తున్న ప్రయాణీకులను హోటల్స్‌లో క్వారెంటెన్‌లో ఉంచుతున్నామన్నారు. రైళ్ల ద్వారా వచ్చిన వారికి ప్రతి రైల్వే స్టేషన్‌లో వైద్య సిబ్బంది జ్వర పరీక్షలు చేసి హోమ్ క్వారటైన్ ముద్రను చేతి మీద వేసి పంపిస్తున్నారు. రోడ్డు మార్గంలో వచ్చిన వారికి రాష్ట్ర సరిహద్దుల్లోనే వైద్య బృందాలు పరీక్షలు చేసి 14 రోజుల పాటు హోమ్ క్వారెంటైన్‌లో ఉంచుతున్నారు. ప్రతి గ్రామంలోకి బయటినుంచి వచ్చిన వారిని గుర్తించి, పరీక్షలు చేసి, 14 రోజులు బయటికి వెళ్లకుండా ఆశా వర్కర్లు పర్యవేక్షణ చేస్తున్నారు. లక్షణాలు ఉన్నవారిని వెంటనే హాస్పిటల్స్ కి తరలించి పరీక్షలు చేస్తున్నాం. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం క్వారెంటెన్ చేస్తున్నామన్నామని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.

ఇప్పటి వరకు విమానాల్లో 798 మంది, రైళ్లలో 239 మంది, రోడ్డు మార్గం ద్వారా 41,805 మంది రాష్ట్రానికి వచ్చారు.లాక్ డౌన్ సడలింపు వల్ల ఎక్కువమంది బయటికి వస్తున్న నేపధ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు మంత్రి పిలుపు ఇచ్చారు. భౌతిక దూరం పాటించాలని, మాస్క్ లు తప్పనిసరిగా ధరించాలని, తరుచుగా చేతులు కడుక్కోవాలి అని కోరారు. ప్రభుత్వం ఎంత చేసినా, ప్రజల భాగస్వామ్యంతోనే కరోనా కట్టడి సాధ్యం అవుతుంది అన్నారు. ఇప్పటి వరకు ప్రజల మద్దతు ఇచ్చారు, ఇక ముందు కూడా ప్రభుత్వం ఇస్తున్న మార్గ నిర్దేశకాలను పాటించి సహకారం అందించాలని కోరారు.

గాంధీ ఆసుపత్రి వైద్యులు అందిస్తున్న వైద్య సేవలు మరువలేనివి అని మరోసారి మంత్రి కొనియాడారు. డిశ్చార్జ్ అయి వెళ్తున్న ప్రతి పేషంట్ సంతృప్తికరంగా వెళ్తున్నారని అన్నారు. అంతేకాదు చికిత్స పొందుతున్న వారికి ప్లాస్మా థెరపీ ద్వారా నయం చేయడానికి అవసరం అయిన ప్లాస్మా కూడా ఇవ్వడానికి ముందుకు రావడం సంతోషం అని మంత్రి అన్నారు.ఈ రోజు గాంధీ వైద్యులు కరోనా పాజిటివ్ ఉన్న మరో గర్భిణి స్త్రీ కి డెలివరీ చేశారు. డాక్టర్ షర్మిల, డాక్టర్ రాణి డెలివరీ చేశారనీ మంత్రి తెలిపారు.

ఐఎంఆర్‌ ఇన్ఫాంట్ మోర్టలిటీ రేట్ గణనీయంగా తగ్గడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఐఎంఆర్‌ 39 ఉండగా, ఇప్పుడు 27కి తగ్గింది అని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే ఇది స్పష్టం చేసింది అన్నారు. ఇందుకోసం కష్టపడుతున్న ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్కరికీ మంత్రి అభినందనలు తెలిపారు. కెసిఆర్ కిట్ వచ్చిన తరువాత చాలా మంది డెలివరీకి హాస్పిటల్స్ కి వస్తున్నారు అని, దీనివల్ల తల్లి, బిడ్డలు క్షేమంగా ఇంటికి వెళ్తున్నారు అని మంత్రి అన్నారు.

- Advertisement -