టూరిజం హబ్ అభివృద్ధిపై మంత్రి ఎర్రబెల్లి సమీక్ష..

146
Minister Errabelli Dayakar
- Advertisement -

పాలకుర్తి నియోజకవర్గంలోని బొమ్మెర, పాలకుర్తి, వల్మిడి టూరిజం హబ్ అభివృద్ధిపై బొమ్మెరలో సంబంధిత అధికారులతో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు బమ్మెర పోతన సమాధి వద్ద ఘనంగా పుష్పాంజలి ఘటించారు మంత్రి ఎర్రబెల్లి.

ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. చారిత్రక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రాలుగా విలసిల్లుతున్న.. బొమ్మెర, వల్మిడి, పాలకుర్తి తదితర ప్రాంతాలను టూరిజం కేంద్రాలుగా అభివృద్ది చేస్తున్నాం. సీఎం కెసిఆర్ ఈ హబ్‌ను తయారు చేయాలని కృత నిశ్చయంతో వున్నారు. సీఎం కెసిఆర్ ఆలోచనలతో ఈ ప్రాంతాన్ని కడిగిన ముత్యంలా చేస్తున్నామన్నారు. ఈ టూరిజం కేంద్రాల అభివృద్ది పనులు శరవేగంగా పూర్తి చేయాలి. అధికారులు ఈ పర్యాటక కేంద్రాల అభివృద్ధికి కంకణ బద్దులై పనిచేయాలని మంత్రి సూచించారు.

బమ్మెరలో 7.5 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం 5.11 కోట్లతో పనులు చేపట్టాం. ఇప్పటి వరకు కోటి 20 లక్షల పని పూర్తి అయింది. అక్షర అభ్యాసం హాల్, బహిరంగ ప్రదర్శన శాల, తూర్పు వైపు ప్రహరీ గోడలు పూర్తి కావచ్చాయి. మిగతా పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తి కావాలి. అలాగే పాలకుర్తిలో 10 కోట్లు మంజూరయ్యాయి. 6.5కోట్ల పనులు చేపట్టగా, అందులో కేవలం 50లక్షల పని మాత్రమే జరిగింది. కళ్యాణ మండపం త్వరగా పూర్తి కావాల్సి ఉందని మంత్రి తెలిపారు.

వల్మిడిలో 5 కోట్లు మంజూరు అవగా, అందులో 2.93 కోట్ల పనులు చేపట్టాం. టెండర్లు ముగిశాయి. ఆయా పనుల నాణ్యతా లోపాలు లేకుండా పనులు వేగంగా జరగాలని మంత్రి అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులు చేయని కాంట్రాక్టర్ల పనులు రద్దు చేసి బ్లాక్ లిస్టులో పెట్టాలని మంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో పాండురంగారావును మంత్రి అభినందించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -