ధాన్యం కొనుగోలుపై మంత్రుల సమీక్ష..

222
minister errabelli
- Advertisement -

ములుగు, జయశంకర్ భూపాలజిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఇరిగేషన్, కోవిడ్ -19, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ లపై సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులతో మంగళవారం ములుగు జిల్లాలోని కలెక్టరేట్‌లో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ సమీక్ష నిర్వహించారు.గత ఏడాది అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి రవాణా సదుపాయాలలో లోటు లేకుండా, గోనె సంచుల తక్కువ కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. అదేవిధంగా గోదాముల సామర్థ్యం, పంట దిగుబడికి తగ్గట్లుగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు.

రైతులు తమ ధాన్యాన్ని తాలు లేకుండా, తేమ శాతం 17 మించకుండా ఉండేలా చూసుకోవాలని విజ్ణప్తి చేశారు. రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన తర్వాత అక్కడ రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, తూకం వేయడంలో, వేసిన తర్వాత అక్కడ ఆగకుండా మిల్లర్లతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. రైతుల ధాన్యాన్ని తాలు, తేమ పేరుతో కోత విధించకుండా మిల్లర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని అధికారులకు సూచించారు.

గత ఏడాది కోవిడ్ వల్ల లాక్ డౌన్ విధించి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని, మళ్లీ ఈసారి కూడా కోవిడ్ విజృంభిస్తోందని, ప్రతి ఒక్కరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అధికారులు కోవిడ్ నేపథ్యంలో అన్ని విధాల సేవలు అందించేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ సాగునీటి విషయంలో ఇప్పటికే తెలంగాణను గొప్పగా తీర్చదిద్దారని, ములుగు జిల్లా, జయశంకర్ భూపాలపల్లిలో కూడా ఆఖరి ఆయకట్టు వరకు నీరు అందేలా గతంలో చేసిన ప్రణాళికలు అమలు జరిగేటట్లు చూడాలన్నారు.

ముఖ్యమంత్రి వచ్చే ఆరు నెలల్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలో మార్కెట్ల పనులు వేగవంతం చేయాలన్నారు. అనంతరం సంచార చేపల విక్రయ వాహానాన్ని ప్రారంభించారు మంత్రులు. ఈ సమావేశంలో ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యేలు వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, సీతక్క, జిల్లా కలెక్టర్లు, అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు

- Advertisement -