సంత్ సేవాలల్ ఆశయాలను కొనసాగిస్తాం:మంత్రి ఎర్రబెల్లి

160
errabelli
- Advertisement -

సంత్ సేవాలాల్ మహరాజ్ బంజారాల ఆరాధ్య దైవం. హిందూ ధర్మం గొప్పతనం బంజారాలకు తెలియజేయడానికి జన్మించిన మహానుభావుడు. సమాజానికి నిజమైన సేవకుడు. అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు జాతికే ఆదర్శ పురుషుడయ్యారు. ఆయ‌న‌ను కేవ‌లం బంజారాలే కాదు, యావ‌త్ జాతి అనునిత్యం గుర్తు చేసుకోవాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు అన్నారు. సంత్ స‌ద్గురు శ్రీ‌ సేవాలాల్ జ‌యంతి ఉత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మాల్లో భాగంగా పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా మంత్రికి సంత్ సేవాలాల్ జ‌యంతి ఉత్స‌వాల నిర్వ‌హ‌ణ క‌మిటీ గిరిజ‌న సంప్ర‌దాయ ప‌ద్ధ‌తుల్లో ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. ‌పాల‌కుర్తి బ‌స్ స్టాండ్ నుంచి స‌మావేశం జ‌రిగిన స్థ‌లం వ‌ర‌కు మంత్రికి గిరిజ‌న సంప్ర‌దాయ బ‌ట్ట‌లు వేసి, త‌ల‌పాగా చుట్టారు. కాగా, మంత్రి పాల‌కుర్తి ప్ర‌ధాన కూడ‌లి వ‌ద్ద గిరిజ‌నుల‌తో క‌లిసి సంప్ర‌దాయ నృత్యం చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో మంత్రి మాట్లాడుతూ, బంజారా జాతిని మంచి మార్గంలో నడిపించేంందుకు సేవాలాల్‌ మహారాజ్ ధర్మ ప్రచారం, ఆర్థిక సంస్కరణలు, మత మార్పిడిలు అరికట్టడం, క్షేత్రధర్మాన్ని రక్షించడం లాంటి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మూఢ నమ్మకాలను నమ్మొద్దు అని ప్రజలకు చెప్పిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. జీవితమంతా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన స్వాతంత్ర్య సమర యోధుడు. 22 రకాల సంస్కరణలు, జీవన సూత్రాలను బంజరాలకు వివరించారు. అడవులను సంరక్షిస్తూ, పర్యావరణాన్ని కాపాడాలని బోధించారు. ఏ రూపంలోనూ వివక్ష తగదన్నారు. మహిళలను గౌరవించాలని, వారు కనిపించే దేవుళ్ళని, సత్యమే పలకాలని, ఎవరికీ హాని చేయవద్దని చెప్పారు. మానవత్వాన్ని కలిగి ఉండాలని చెప్పారు. అని సేవాలాల్ బోధ‌న‌ల‌ను మంత్రి గిరిజ‌నుల‌కు గుర్తు చేశారు. అహింస పాపమని, మత్తు, ధూమ పానం శాపం అని హితవు పలికి బంజారా జాతికే కాదు యావత్తు ఇతర కులాలకు ఆదర్శపురుషుడయ్యారు. ఆయ‌న‌ను ఆద‌ర్శంగా సీఎం కెసిఆర్ అనేక సంస్క‌ర‌ణ‌లు చేప‌ట్టారు. ప్ర‌ధానంగా నాటుసారాని నిర్మూలించారు. వారికి ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించారు. అని చెప్పారు.

అయితే, గిరిజ‌నులే కాదు మ‌న‌మెవ‌ర‌మైనా మన సంస్కృతి ని మనం ఏనాడూ మరచి పోవద్దు. గిరిజన బిడ్డలుగా పుట్టడం మీ అదృష్టం. మీకు ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం ఎక్కువ. మీ ఆహార్యం అద్భుతంగా ఉంటుంది. భాష కి కూడా ప్రత్యేకత ఉంది. వాటిని మీరు విడవద్దు. లంబాడాలతో మా కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉంది. అని వివ‌రించారు.

రాముడు, ఏసు, అల్లా అంతా మానవులే. మానవులు ఎలా ఉండాలో, ఉండకూడదో చెప్పిన ఆ మహానుభావులు దేవుళ్లు గా ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. అలాంటి కోవ కు చెందిన వారే, సంత్ సేవాలాల్. సేవాలాల్ బోధనలు మరచిపోవద్దు. నీతి నిజాయితీలను విడనాడ వద్దు. సేవాలాల్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. మీ తండాల్లో, మీ రాజ్యం నడవాలని మీ తండాలను గ్రామ పంచాయతీలను చేశాం. గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్ర, పార్లమెంట్ పరిధిలో ఆ విషయం ఉంది. అని మంత్రి వివ‌రించారు.

గిరిజనులు ప్రధానంగా వ్యవసాయం మీదే ఆధార పడతారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ ఎంతో చేస్తున్నారు. దండగ అనుకున్న వ్యవసాయాన్ని పండుగ చేసిన ఘనత సీఎం కెసిఆర్ దే. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ ను అంతరాయం లేకుండా అందిస్తున్నాం. రైతు బంధు, రైతు భీమా, మిషన్ భగీరథ మంచినీరు అందిస్తున్న ఘనత ఒక్క మన తెలంగాణ లోనే ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఖరి అధ్వాన్నంగా ఉంది. కేంద్రం రైతులకు అన్యాయం చేసే విధంగా ఉన్న చట్టాలను తెచ్చింది. వాటిని వ్యతిరేకించాలి. అని మంత్రి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

మ‌రోవైపు పాలకుర్తి మండల కేంద్రంలో సేవాలాల్ భవణం నిర్మించే బాధ్యత తీసుకుంటాను. నన్ను అత్యంత కష్ట కాలంలో కూడా ఆదుకున్నారు. ఉద్యమం, టీఆరెఎస్, కెసిఆర్ అందర్నీ ఇష్ట పడుతూనే, నేను ఎక్కడ ఉన్నా నన్ను ఆదరించారు. మీ రుణం తీర్చుకుంటాను. అని మంత్రి గిరిజ‌నుల‌కు తెలిపారు.ఈ కార్య‌క్ర‌మంలో సంత్ సేవాలాల్ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ క‌మిటీ, నిర్వాహ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు, అనేక మంది గిరిజ‌నులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -