రోడ్లకిరువైపుల ప్లాంటేషన్‌ను చేపట్టాలి- మంత్రి ఎర్రబెల్లి

119
- Advertisement -

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో 8 కోట్ల 76 లక్షల 30 వేల మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 7 కోట్ల 91 లక్షల 2 వేల మొక్కలను నాటడం జరిగిందని రాష్ట్ర పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మిగతా మొక్కలను నాటే ప్రక్రియ ఆగస్టు నెలాఖరు లోగా పూర్తి చేస్తామని అయన తెలిపారు. హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలోని నల్గొండ జిల్లాలోని మునుగోడు గ్రామం వద్ద హైవే రోడ్డుపై మొక్కలు నాటుతున్న ఉపాధి హామీ కూలీలతో, గ్రామ పంచాయితీ కార్యదర్శితో శుక్రవారం నాడు మంత్రి మాట్లాడారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఆర్ధిక సంవత్సరంలో మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ క్రింద రాష్ట్రంలో 6 వేల 437 కి.మీ పొడవైన రోడ్లకిరువైపున ప్లాంటేషన్ ను చేపట్టాలని గుర్తించడం జరిగిందని అయన తెలిపారు. అందులోభాగంగా ఇప్పటివరకు 3 వేల 208 కి.మీ పొడవైన ప్లాంటేషన్ ను పూర్తి చేయడం జరిగిందని, మిగతా 3 వేల 155 కి.మీ పొడవైన అవెన్యూ ప్లాంటేషన్ ను వెంటనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. రోడ్డుకిరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ వెంటనే పూర్తి చేయాలని, నాటిన ప్రతి మొక్క సంరక్షించే విధంగా చర్యలు చేపట్టాలని మంత్రి గ్రామ పంచాయితీ సెక్రటరీని ఆదేశించారు. నాటిన మొక్కలు వాడిపోకుండా ఎప్పటికప్పుడు వాటరింగ్ చేయాలని అయన కోరారు. మేకలు, ఇతర జంతువుల నుండి మొక్కలను రక్షించడానికి మొక్కలు నాటిన వెంటనే ట్రీగార్డులు అమర్చాలని మంత్రి ఆదేశించారు.

- Advertisement -