ప‌ల్లెప్ర‌గ‌తిలో ప‌చ్చ‌దనం పెంపొందించాలి: మంత్రి ఎర్ర‌బెల్లి

139
Minister Errabelli
- Advertisement -

పల్లెప్ర‌గ‌తిలో భాగంగా ప‌చ్చ‌దనం పెంపులో ఉపాధి కూలీలు కృషి చేయాల‌ని రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రా శాఖామంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావు అన్నారు. శుక్ర‌వారం వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి మండ‌లం బూర్గుమడ్ల గ్రామంలో మంత్రి ప‌ర్య‌టించారు. హరితహారం క్రింద నాటిన మొక్కలు పరిశీలించారు. ఈ సంద‌ర్భంగా ర‌హదారుల వెంట మొక్క‌లు నాటి వాటికి ప్లాస్టిక్ ర‌క్ష‌ణ గార్డుల‌ను ఏర్పాటు చేయ‌క పోవడం వ‌ల్ల ప‌శువులు వ‌ల్ల దెబ్బ‌తింటున్నాయ‌ని, వాటికి ముళ్ల కంచెతో రక్షణకు చర్యలు తీసుకోవాలని, కూలీల‌కు ప్ర‌త్య‌క్షంగా చేసి చూపించారు. ఉపాధి హామీ ప‌థ‌కం ద్వారా ప్ర‌తి గ్రామంలో ప‌చ్చ‌దనం పెంపుకు విరివిగా మొక్క‌లు నాటాల‌ని ఆదేశించారు. గ్రామ ప్రవేశం నుండి రహదారి కిరువైపుల పచ్చదనంతో గ్రామాలకు క్రొత్త శోభ తేవాలన్నారు.

ప‌ల్లె ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో నాటిన మొక్క‌ల‌ను సంర‌క్ష‌ణ‌కు ప్ర‌తి ఒక్క‌రు బాధ్యతగా ప‌నిచేయాల‌ని పిలుపునిచ్చారు. వన సేవకులకు చెల్లింపులు ఎప్పటికప్పుడు చేయాలన్నారు. నాటిన మొక్కలు వంద శాతం మనుగడ పొందేలా, కార్యాచరణ చేయాలన్నారు. మొక్కలకు షెడ్యూల్ ప్రకారం వాటరింగ్ కచ్చితంగా చేపట్టాలని అన్నారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించారు. పల్లె ప్రజలు ఆహ్లాదకరంగా కొంత సమయం గడపడానికి, మంచి గాలికి మొక్కలు, శారీరక ధృఢత్వానికి ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్ లతో రాష్ట్రంలోని ప్రతి ఆవాసంలో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని మంత్రి అన్నారు. 19 వేల 470 అవాసాల్లో రూ. 115 కోట్ల 10 లక్షల ఖర్చుతో పల్లె ప్రకృతి వనాల ఏర్పాటుకుగాను ఇప్పటివరకు 18 వేల 68 అవాసాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు. పల్లెల సమగ్ర అభివృద్ధి, ప్రజల వికాసానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి అన్నారు.

- Advertisement -