కోవిడ్ నిబంధనలను మార్చి 31 వరకు పొడిగించిన కేంద్రం

231
COVID-19 guidelines
- Advertisement -

కేంద్ర ప్రభుత్వం కొవిడ్-19 నిబంధనలను మరోసారి పొడిగించింది. మార్చి 31 వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర హోం శాఖ శుక్రవారం (ఫిబ్రవరి 26) ప్రకటించింది. కొవిడ్-19 తీవ్రత తగ్గకపోగా, కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో నిబంధనలు కచ్చితంగా పాటించాల్సిందేని స్పష్టం చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించింది. నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకునేలా వ్యాక్సినేషన్ ను కొనసాగించాలని… అప్పుడే కరోనా చైన్ ను బ్రేక్ చేయగలమని చెప్పారు. కంటైన్మెంట్ జోన్లను సరిగా గుర్తించాలని కేంద్రం తెలిపింది. ఈ జోన్లలో కరోనా నిబంధనలకు పటిష్టంగా అమలు చేయాలని చెప్పింది. జనవరి 27న విడుదల చేసిన గైడ్ లైన్స్ ను పాటించాలని తెలిపింది.

అయితే కొత్త నిబంధనల ప్రకారం సినిమా థియేటర్లు, స్విమ్మింగ్ పూల్స్ కొనసాగుతాయి. సామాజిక, మత, సాంఘిక కార్యక్రమాలపై ఆంక్షలు ఉండవు. పాఠశాలలు థియేటర్లు వంటివి 50 శాతం ఆక్యుపెన్సీతో కొనసాగవచ్చు. క్లోజ్డ్ ప్రదేశాల్లో 200 మందికి మించి గుమికూడదు. అంతరాష్ట్ర ప్రయాణాలు, సరకు రవాణాపై ఎలాంటి ఆంక్షలు ఉండవు. ట్రేడ్ ఒప్పందాల ప్రకారం సరిహద్దు దేశాలతో వాణిజ్యం కొనసాగుతుంది. ప్రయాణాలకు ఎలాంటి ఈ-పర్మిషన్లు అవసరం లేదు. కంటైన్మెంట్ జోన్లకు వెలుపల అన్ని కార్యకలాపాలను కొనసాగించవచ్చు. అయితే కోవిడ్ ప్రొటోకాల్ ను పాటించాల్సి ఉంటుంది.

అలాగే అంతర్జాతీయ విమానాలపై నిషేధం మార్చి 31 అర్ధరాత్రి వరకూ కొనసాగుతుందని, సరుకు రవాణా విమానాలు, డీజీసీఏ ఆమోదం పొందిన విమాన సేవలకు ఈ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది. గత ఏడాది జూన్‌ 26న అంతర్జాతీయ కమర్షియల్‌ ప్యాసింజర్‌ విమానాలపై నిషేధం విధిస్తూ జారీ అయిన ఉత్తర్వుల అమలును మార్చి 31 అర్ధరాత్రి వరకూ పొడిగించామని డీజీసీఏ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -