దీదీ రివర్స్ గేర్.. కాంగ్రెస్ పై ఫైర్!

14
- Advertisement -

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఇండియా కూటమిలో విభేదాలు రోజురోజుకూ ముదురుతున్నాయి. కూటమిలో కాంగ్రెస్ వైఖరిపై విమర్శలు గుప్పిస్తూ ఒక్కో పార్టీ కూటమి నుంచి బయటకు వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే జేడీయూ పార్టీ ఇండియా కూటమికి బై బై చెప్పి ఎన్డీయేతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మిగిలిన పార్టీలు కూడా కూటమిని విడిచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా కూటమిలో ఉండడం కష్టమే అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ మద్య మమతా బెనర్జీ తరచూ కాంగ్రెస్ పై ఘాటు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పశ్చిమ బెంగాల్ లో కూటమితో సంబంధం లేకుండా పోటీ చేస్తామని ఇప్పటికే దీదీ ప్రకటించారు..

దీంతో కాంగ్రెస్ తో ఆమె విభేదిస్తున్నాట్లు స్పష్టమైంది. ఇక ఇటీవల మరోసారి ఆమె కాంగ్రెస్ పై చేసిన విమర్శలను బట్టి చూస్తే ఇండియా కూటమి నుంచి మమత బయటకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే సందేహాలు రాక మానవు. ఇటీవల ఆమె కాంగ్రెస్ పార్టీని ఉద్దేశిస్తూ లోక్ సభ ఎన్నికల్లో 40 సీట్లు కూడా ఆ పార్టీకి రావడం కష్టమే అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర కేవలం ఫోటో షూట్ అంటూ వ్యాఖ్యానించారు.

దీన్ని బట్టి చూస్తే ఆమె కాంగ్రెస్ పార్టీని ఏ స్థాయిలో విభేదిస్తున్నారో అర్థమౌతుంది. సీట్ల సర్దుబాటులో కాంగ్రెస్ అధిష్టానం నియంత దొరణి అవలంభిస్తోందని అందుకే సీట్ల విషయమై కాంగ్రెస్ తో చర్చలు జరపడం మానేశామని మమతా చెప్పుకొచ్చారు. బెంగాల్ లో కాంగ్రెస్ సపోర్ట్ లేకుండానే బీజేపీని ఓడించే సామర్థ్యం తృణమూల్ కాంగ్రెస్ కు ఉందని చెప్తూ కాంగ్రెస్ అండ తమకు అవసరం లేదనే విధంగా వ్యాఖ్యానించారు మమతా బెనర్జీ దీంతో ఎన్నికల ముందే ఇండియా కూటమి నుంచి తృణమూల్ కాంగ్రెస్ కూడా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది కొందరి అభిప్రాయం. మరి మమతా బెనర్జీ కూటమి నుంచి బయటకు వస్తే కూటమి పూర్తిగా నిర్వీర్యం అయినట్లేనని చెబుతున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:భారతరత్న.. ఎల్‌కే అద్వానీ

- Advertisement -