మోదీ బెంగాల్‌లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు: దీదీ

142
Mamata-Banerjee
- Advertisement -

యాస్ తుపాను నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య రాజకీయ వేడి రగిలింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మమత బెనర్జీ ఉద్దేశపూర్వకంగానే చాలా సేపు వేచి ఉండేలా చేసినట్లు వచ్చిన వార్తలపై మమత తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో ఓటమిని మోదీ జీర్ణించుకోలేకపోతున్నారని, అందుకే తనను ప్రతిసారీ అవమానిస్తున్నారని, బెంగాలీల కోసం అవసరమైతే మోదీ కాళ్ళు పట్టుకోవడానికైనా తాను సిద్ధమని చెప్పారు. మే 28న జరిగిన సంఘటనలను వివరించేందుకు ఆమె ప్రత్యేకంగా ఓ విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

బెంగాల్‌కి మేలు చేస్తానంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కాళ్లు పట్టుకునేందుకు తాను సిద్ధమంటూ సంచలన ప్రకటన చేశారు దీదీ. చిల్లర రాజకీయాలు చేస్తూ బెంగాల్‌ ప్రజలను అవమానపరచొద్దంటూ బీజేపీకి, ప్రధాని మోదీలకు తేల్చి చెప్పారామే. బెంగాల్‌ ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న చీఫ్‌ సెక్రటరీ బదిలీని రద్దు చేయాలని కేంద్రాన్ని మమత బెనర్జీ డిమాండ్‌ చేశారు.

యాస్‌ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలని ముందుగానే షెడ్యూల్‌​ ఖరారు చేసుకున్నట్టు మమత తెలిపారు. ఇంతలో ప్రధాని పర్యటన ఉందని తెలియడంతో… ఆయన హెలికాప్టర్‌ దిగే స్థలానికి చేరుకుని ఎదురు చూశామ‍ని… ఆ తర్వాత ఆయన్ని కలిసేందుకు వెళితే మీటింగ్‌లో ఉన్నారని, ఎవరికీ అనుమతి లేదని చెప్పడంతో అక్కడ మరో 20 నిమిషాల పాటు ఎదురు చూశామన్నారు. ఆ తర్వాత కాన్ఫరెన్స్‌హాల్‌లో ప్రధాని, ముఖ్యమంత్రుల సమావేశం ఉందని చెప్పడంతో అక్కడికి వెళ్లామన్నారు. అయితే అక్కడ ప్రతిపక్షపార్టీలకు చెందిన నాయకులు కూడా ఉన్నారని మమత తెలిపారు. దీంతో వెంటనే ప్రధానికి తమ రిపోర్టును సమర్పించి… ఆయన అనుమతి తోనే అక్కడి నుంచి బయటకు వచ్చామన్నారు. ఆ వెంటనే తుపాను ప్రభావిత ప్రాంతాల పర్యటనకు తాను వెళ్లినట్టు మమత వివరించారు.

ఇటీవల వచ్చిన తుపానుల నష్టాన్ని అంచనా వేసేందుకు గుజరాత్‌, ఒడిషాలలో ప్రధాని మోదీ పర్యటించారు. ఆ రాష్ట్ర సీఎంలతో సమావేశమయ్యారు, కానీ ఎక్కడా ప్రతిపక్ష నేతలను ఆ సమావేశాలకు ఆహ్వనించలేదని మమత చెప్పారు. కేవలం బెంగాల్‌లోనే ఎందుకు ప్రతిపక్ష పార్టీలను మీటింగ్‌కు పిలిచారని ఆమె అడిగారు. ఇటీవల బెంగాల్‌లో ఎదురైన ఘోర ఓటమిని బీజేపీ జీర్ణించుకోలేక పోతుందని, అందుకే ఆ ఓటమికి ప్రతీకారంగా బెంగాల్‌ ప్రజలను అవమానించాలని చూస్తున్నారంటూ మమత ఆరోపించారు. ప్రధాని ఎప్పుడు బెంగాల్‌కి వచ్చినా ఇక్కడి ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని చూస్తున్నారంటూ ఆమె విమర్శించారు. ప్రధాని, సీఎంల మీటింగ్‌కు సంబంధించి తనకు అనుకూలంగా ఉన్న వెర్షన్‌నే బీజేపీ ప్రచారంలోకి తెచ్చి, నన్ను ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తోందని మమత అన్నారు. అందుకే ఆ మీటింగ్‌ సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తున్నానంటూ మమత చెప్పారు.

- Advertisement -