మహేశ్‌ పిలుపుతో విరియనున్న హరితవనం

187
mahesh babu
- Advertisement -

ఆగస్టు 9 తన పుట్టిన రోజు సందర్భంగా తన అభిమానులందరూ మొక్కలు నాటాలని సినీ హీరో మహేశ్ బాబు పిలుపునిచ్చారు. ప్రకృతి సమతుల్యత, కాలుష్య నివారణ దిశగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి తనపై అభిమానం చాటుకోవాలని ఇన్ స్టాగ్రామ్ వేదికగా తన అభిమానులకు మహేశ్ బాబు పిలుపునిచ్చారు.

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన పుట్టిన రోజున మొక్కలు నాటాలని ప్రముఖ హీరో మహేశ్ బాబు తన అభిమానులకు పిలుపునివ్వడం పై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఫౌండర్ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. పెద్ద ఎత్తున అభిమానులున్న మహేశ్ బాబు వంటి ప్రముఖ హీరో, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన అభిమానులకు తలా మూడు మొక్కలు నాటాలని పిలుపునివ్వడం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం పట్ల మహేశ్ బాబుకున్న అభిమానానికి నిదర్శనం అని అది గొప్ప విషయం అన్నారు. జన హృదయాల్లో ప్రిన్స్ గా వున్న సూపర్ స్టార్ మహేశ్ బాబు పిలుపు తన హృదయాన్ని కదిలించిందని ఎంపీ సంతోషం వ్యక్తం చేశారు. మహేశ్ బాబు వంటి గొప్పవ్యక్తుల మద్దతుతోనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా ముందుకు సాగుతున్నదని, ఈ సందరర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ తన ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు.

గతంలో కూడా తన పుట్టిన రోజును పురస్కరించుకుని మహేశ్ బాబు మొక్కలునాటారని ఎంపీ సంతోష్ కుమార్ గుర్తు చేసుకున్నారు. భౌతిక ఆస్తులు అంతస్తులు మాత్రమే కాదని, రేపటి తరాలకు మనం కూడబెట్టాల్సింది వారు సుఖంగా జీవించడానికి కావాల్సిన ప్రకృతి పచ్చదనాన్ని అందించడమే మన కర్తవ్యంగా ఉండాలని, గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు అంటుంటారని ఎంపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సిఎం కెసిఆర్ హరితహారం స్పూర్తితో తాను కొనసాగిస్తున్న గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మహేశ్ బాబు పాలుపంచుకోవడం గొప్ప విషయమని అది ఆయన అభిమానులకే కాకుండా ప్రతి వొక్కరికీ స్పూర్తిదాయకమన్నారు.

పచ్చదనం పలచబడడంతో విశ్వ వేదికమీద ప్రకృతి సమతుల్యత రోజు రోజుకూ దెబ్బతిని పోతున్నదని, ఈ నేపథ్యంలో పచ్చదనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిమీద వున్నదని ఎంపీ పునరుద్ఘాటించారు. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా నేపథ్యంలో ప్రపంచ పర్యావరణం పట్ల మహేశ్ బాబు వంటి ప్రజాదరణ కలిగిన ప్రముఖ హీరోలు ప్రకృతి కోసం మనసు కేంద్రీకరించడం మహోన్నతమైన విషయమన్నారు. మహేశ్ బాబు పిలుపు మేరకు అగస్టు 9 న మనిషికి వొక్కంటికి మూడు మొక్కలు నాటుతున్న ప్రపంచ వ్యాప్తంగా వున్న మహేశ్ బాబు అభిమానులకు ఎంపీ సంతోష్ కుమార్ అభినందనలు తెలిపారు. మహేశ్ బాబు పేరుతో నాటుతున్న మొక్కలు వృక్షాలుగా పెరిగి పెద్దవయి ఎందరికో నీడనిస్తూ చిరకాలం నిలుస్తాయని ఎంపీ ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -