దేశరాజధాని ఢిల్లీకి చేరింది మిడతల దండు. వేలాది మిడతలు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోకి ప్రవేశించడంతో ఆకాశం నల్లగా మారిపోయింది. ఢిల్లీకి మిడతల దండు చేరడంతో అప్రమత్తమైన ఆప్ సర్కార్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.
మిడతల దండు ఢిల్లీకి సమీపంగా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీ విమానాశ్రయం అధికారులను ఏటీసీ అప్రమత్తం చేసింది. పైలట్లు విమానాలు దిగే సమయంలో, ఎగిరే సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హెచ్చరించింది.
ఇక ఇప్పటివరకు పంట పొలాలపై వాలుతూ క్షణాల్లో నామరూపాల్లేకుండా తినేస్తున్న మిడతలు.. అటు జనావాసాల్లోనూ చేరి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. కిటికీలు తెరిచి ఉంటే ఇంట్లోకి ప్రవేశిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
గురుగ్రామ్లోని సైబర్ హబ్ ప్రాంతంలో మిడతలు ఆకాశాన్ని కమ్మేశాయి. మిడతల దండును తరిమేందుకు పాత్రలను కొట్టడంతో పాటు పెద్దగా శబ్దాలు చేయడం చేస్తున్నారు ప్రజలు. ఇక ఢిల్లీలో మిడతల దండుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.

