భారీ వర్షాలు…అధికారులతో మంత్రి కేటీఆర్ టెలీకాన్ఫరెన్స్‌

175
ktr
- Advertisement -

హైదరాబాద్ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఉదయమే జీ హెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు మంత్రి కేటీఆర్.ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్ తోపాటు పురపాలక శాఖ విభాగాల అధిపతులు మరియు హైదరాబాద్ మేడ్చల్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లతో కలిసి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరియు డిప్యూటీ స్పీకర్ బాబా ఫసియుద్దిన్ పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీలో ప్రస్తుతమున్న అధికారులంతా ఈ క్షేత్రంలోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశారు కేటీఆర్. హైదరాబాద్ నగర మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు, నగర ఎమ్మెల్యేలంతా క్షేత్రస్థాయిలో పర్యటించి పర్యవేక్షణ చేయాలని ….. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ఫంక్షన్ హాల్, కమ్యూనిటీ హాల్ లకు వరద ప్రభావిత ప్రజల్ని తరలించాలి. వారికి అక్కడే ఆహారంతో పాటు అవసరమైన దుప్పట్లు వైద్య సదుపాయం కల్పించాలన్నారు.

ఇలాంటి క్యాంపుల్లో ప్రస్తుతం బస్తి దావఖాన లో పనిచేస్తున్న డాక్టర్లతో పాటు ఇతర వైద్య సిబ్బంది అందరూ పాల్గొనాలని సూచించారు. ప్రస్తుత భారీ వర్షాలకు పెద్దఎత్తున నగరంలో చెట్లు మరియు విద్యుత్ పోల్స్ విరిగిపోయిన నేపథ్యంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు జిహెచ్ఎంసి, విద్యుత్ సంస్థలతో కలిసి సమన్వయం చేసుకోవాలని సూచించారు.

హిమాయత్ సాగర్, హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండి, అక్కడి నుంచి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో మూసి లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో నుంచి ప్రజలను తరలించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు. హైదరాబాద్ నగర రోడ్ల పైన ప్రస్తుతం పేరుకుపోయిన నీటిని పంపించేందుకు ఓపెన్ చేసిన మ్యాన్హోల్స్ వంటి ప్రాంతాల్లో సురక్షిత చర్యలు తీసుకునేలా జలమండలికి ఆదేశాలు జారీ చేశారు. ఓపెన్ నాలల వద్ద ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు స్థానిక మున్సిపల్ కమిషనర్లు, క్షేత్ర సిబ్బంది పర్యవేక్షణ చేయాలన్నారు. వాతావరణ శాఖతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ జిహెచ్ఎంసి మరియు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందితో సమన్వయం చేసుకొని ముందుకు పోవాలన్నారు.

- Advertisement -