చేనేత రంగానికి గణనీయమైన సేవలు అందిస్తున్న పద్మశ్రీ చింతకింది మల్లేశంకు తెలంగాణ ప్రభుత్వం తరఫున మంత్రి కేటీఆర్ కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. చేనేత పరిశ్రమకు వీలైనంత ఎక్కువగా సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే టెక్స్టైల్ శాఖకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు చేశామని మంత్రి అన్నారు. రూరల్ ఇన్నోవేషన్ రంగానికి చేయూతనిస్తున్నామని, అందులో భాగంగానే గ్రామీణ స్థాయి నుంచి అద్బుతమైన అవిష్కరణ చేసిన చింతకింది మల్లేశం సేవలను ప్రత్యేకంగా గుర్తించి ఈ ఆర్థిక సాయం అందించామని మంత్రి తెలిపారు. మల్లేషంకు మరింత సహాకారం అందిస్తామన్నారు. తన విజ్ఞప్తి మేరకు ఆర్థిక సహకారం అందించిన తెలంగాణ ప్రభుత్వానికి, మంత్రి కె తారక రామారావుకు మల్లేషం ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ప్రభుత్వం అందించిన ఈ కోటి రూపాయల గ్రాంట్ తో చింతకింది మల్లేశం తన లక్ష్మీ అసు మిషన్ల ఉత్పత్తిని పెంచేందుకు, మరియు చేనేత రంగానికి అవసరం అయిన ఇతర ఆవిష్కరణలు చేసేందుకు వినియోగించుకోనున్నారు.ప్రస్తుతం ఆలేరులోని తన సొంత ఇంటి నుంచి ఆసు మెషిన్లను మల్లేశం తయారుచేస్తున్నారు. సుమారు 650 మేషిన్లకు డిమాండ్ ఉన్నదని, ఈ ఆర్థిక సహాయం ద్వారా మెషీన్లను తయారు చేసేందుకు కోసం వీలు కలుగుతుందని తెలిపారు. పోచంపల్లిలో పాత పద్దతుల్లో చేనేత పనులు నిర్వహిస్తున్న కార్మికులకు సరఫరా చేసేందుకు వీలుకలుగుతుంది.
తెలంగాణలోని చేనేత కార్మికులకు ఉపయోగపడే ఈ మిషిన్లకు భవిష్యత్తులో మరింత డిమాండ్ వస్తుందని, ఈ డిమాండ్కు అనుగుణంగా తన ఉత్పత్తిని పెంచేందుకు అవసరమైన ఇంజనీరింగ్ మరియు ఇతర సౌకర్యాల కల్పన కోసం ప్రభుత్వం నుంచి చింతకింది మల్లేశం ఆర్థిక సహాయం కోసం గతంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మల్లేశం విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం టెక్స్ టైల్ శాఖ తరఫున కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది.