కేబినెట్ అమోదంతోనే కాళేశ్వరం నిర్మాణం

6
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల విమర్శలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. రెండు పార్టీలు ఒకే ఎజెండాతో కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని బదనాం చేయాలన్న కుట్రతో పనిచేస్తున్నాయని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక్క వ్యక్తి నిర్ణయం కాదు, అప్పటి మంత్రివర్గం సమిష్టిగా తీసుకున్న నిర్ణయమేనని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇదే విషయాన్ని అప్పటి మంత్రులు ఈటెల రాజేందర్, హరీష్ రావు కూడా స్పష్టంగా చెప్పారు. ప్రాజెక్ట్ అనేది ప్రభుత్వ విధానపర నిర్ణయం, ఆచరణ బాధ్యత అధికారులు, యంత్రాంగంపై ఉంటుందని కేటీఆర్ వివరించారు. “కాలేశ్వరం నిర్మాణం పూర్తిగా పారదర్శకంగా జరిగింది. దాచాల్సిందేమీ లేదు” అన్నారు. హరీష్ రావు చేసిన ప్రజెంటేషన్ చూస్తే, కాలేశ్వరం ప్రాజెక్ట్ ప్రాధాన్యత, ప్రయోజనాలు స్పష్టంగా తెలుస్తాయని పేర్కొన్నారు.

“అరటిపండు వొలిచినట్టు హరీష్ రావు వివరించారు” అని అన్నారు. 45 లక్షల ఎకరాలకు నీరు అందించే కాళేశ్వరం వంటి ప్రాజెక్టు మరో దేశంలో నిర్మించి ఉంటే, ఆ నాయకుడి పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేది. అయితే మన దేశంలో మాత్రం రాజకీయ కుయుక్తులు, కుట్రలకు పావుగా మారిందని విమర్శించారు. “బీజేపీ, కాంగ్రెస్ ఒకే ఎజెండాతో కేసీఆర్‌ను బదనాం చేయాలని చూస్తున్నాయి. దున్నపోతు ఈనిందంటే దుడ్డేను కట్టేయమన్నట్టుగా అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నోటీసులతో వేధిస్తున్నారు” అని మండిపడ్డారు.

మేము ఇప్పటికే ఈ అంశంలో చెప్పాల్సినదంతా స్పష్టంగా చెప్పేశాం. ఈరోజు కమిషన్ ముందు హరీశ్ రావు పూర్తి అంశాలు వివరించారు. కేసీఆర్ గారిని కమిషన్ కొత్తగా అడిగేందుకు ఏమీ ఉండదు. మేము చెప్పాల్సింది అంతా ఇప్పటికే వివరంగా చెప్పేశాం’’ అని కేటీఆర్ అన్నారు. భాక్రా నంగల్, నాగార్జున సాగర్, నర్మద, ఎస్‌ఆర్‌ఎస్‌పీ ప్రాజెక్టులకు దశాబ్దాల పాటు పట్టింది, కానీ కేసీఆర్ నాలుగేళ్లలోనే కాళేశ్వరం పూర్తిచేశారు. ఇది సాధారణ విషయం కాదు” అని పేర్కొన్నారు. బీజేపీ–కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇంతటి భారీ ప్రాజెక్టును నిర్మించినందుకు బదులుగా ఇప్పుడు కుట్రలు చేస్తున్నాయి అని ఆరోపించారు. “రాష్ట్రాన్ని విధ్వంసం చేసే విధ్వంసకర పాలన కాంగ్రెస్ చేస్తున్నది. 420 హామీలు ఇచ్చి మోసం చేశారు. తాటాకు చప్పుళ్లకు భయపడే నాయకులు బీఆర్ఎస్‌లో లేరు” అని తీవ్రంగా విమర్శించారు. “మీడియా మేనేజ్‌మెంట్ ద్వారా ప్రధాని దృష్టిని ఆకర్షించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడు” అని విమర్శించారు.

Also Read:వైసీపీపై దుష్ప్రచారం..సజ్జల ఫైర్

- Advertisement -