వచ్చే ఐదేళ్లలో 100 కోట్ల మొక్కలు నాటి కాపాడాలనే బృహత్తర సంకల్పంతో పర్యావరణ సంరక్షణ కోసం తపిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ తన 9వ విడత కార్యాచరణను ప్రారంభించింది. బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని గోదావరి తీర ప్రాంతంలో 99 లక్షల మొక్కలు నాటే హరిత యజ్ఞం గురువారం మొదలైంది. మహారాష్ట్ర, నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలోని బాబ్లీ వద్ద గోదావరి తీరంలో 1,000 వెదురు మొక్కలు నాటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగిన పల్లి సంతోష్ కుమార్, ఇగ్నైటింగ్ మైండ్స్ సంస్థ ఫౌండర్ కరుణాకర్ రెడ్డి, గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, యూత్ ఫర్ గోదావరి బృందం, బాబ్లీ ,పొరుగు గ్రామాల సర్పంచ్లు, అటవీ శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొన్నారు.
గోదావరికి రిటైనింగ్ వాల్
బాసర నుంచి త్రయంబకేశ్వర్ వదరకు గోదావరి నదికి రెండు వైపులా నది కోతకు గురి కాకుండా వెదురు మొక్కలు నాటి సంరక్షించనున్నారు. నది పొడవునా 99 లక్షలను నాటి సంరక్షించనున్నారు. ఇందుకోసం మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని విద్యార్థులు, NSS, NCC వాలంటీర్లు, యువజన సంఘాలకు చెందిన 50 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. దక్కన్ ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రతలను తట్టుకోగల డెండ్రోకలామస్ స్ట్రిక్టస్, బంబూసా బంబోస్ వంటి స్థానిక వెదురు రకాలకు ఈ విడతలో ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ హరితహారం మంజీరా, ప్రాణహిత నదుల పరివాహక
ప్రాంతాల్లో కూడా కొనసాగనుంది. ఈ వెదురు చెట్లు..నదీ తీరాల్లోని మట్టిని గట్టిగా పట్టి ఉంచి, వర్షాకాలంలో భూమి కోతకు గురికాకుండా ప్రకృతిసిద్ధమైన ‘రిటైనింగ్ వాల్’ లాగా రక్షణ ఇస్తుంది. ఈ రకం వెదురుకు వేగంగా కార్బన్ ను గ్రహించే గుణం ఉంది. ఈ మొక్కలకు జియోట్యాగింగ్ కూడా చేయనున్నారు.
కేటీఆర్ బర్త్ డే వినూత్నంగా..
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పుట్టిన రోజును గ్రీన్ ఇండియా చాలెంజ్ వినూత్నంగా నిర్వహిస్తున్నది.
కేటీఆర్ జీవితంలో పూర్తయిన ఒక్కో ఏడాదికి 2 లక్షల మొక్కల చొప్పున .. గ్రీన్ ఇండియా చాలెంజ్ 99 లక్షల మొక్కలు నాటుతున్నది. వచ్చే ఏడాది వరకు గోదావరి నదీ పరివాహక ప్రాంతమంతటా ఈ ప్లాంటేషన్ డ్రైవ్ కొనసాగనుంది. భారత దేశంలో నదీ ఆధారిత పర్యావరణ సంరక్షణ ఉద్యమాల్లో గ్రీన్ ఇండియా చాలెంజ్ 9 వ విశిష్ట స్థానాన్ని దక్కించుకోనున్నది.

నది బావుంటే..మనమందరం బావుంటాం
తెలంగాణ సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన హరిత హారం స్ఫూర్తితో రూపుదిద్దుకున్న గ్రీన్ ఇండియా చాలెంజ్… అతి పెద్ద పర్యావరణ సంరక్షణ ఉద్యమాల్లో ఒకటిగా నిలిచింది.
మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ నేతృత్వంలో 2018లో ప్రారంభమైంది. నాడు ఒకే మొక్కతో మొదలై..నేడు 19.6 కోట్లకు పైగా మొక్కలు నాటగలిగింది. 4.4 కోట్ల మంది ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేయగలిగింది. రానున్న ఐదేళ్లలో 2031 అక్టోబర్ 31 నాటికి.. 100 కోట్ల మొక్కలు నాటి సంరక్షించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… “నది అంటే కేవలం నీటి ప్రవాహం కాదు. అది మానవ సమూహానికి ప్రాణ వాయువుతో సమానం. జీవరాశులకు నీరు అందిస్తుంది. రైతులకు సాగునీరు అందిస్తుంది. ధరిత్రిపై సకల పంటలు పండేందుకు ఆయువవుతుంది. రాబోయే తరాలకు చక్కటి సంస్కృతిని వారసత్వాన్ని అందిస్తుంది. కేటీఆర్ గారి 50వ పుట్టినరోజు సందర్భంగా, జీవిత కాలాన్ని మించి నిలిచే ఒక విశిష్ట హరిత బహుమతిని ఇవ్వాలనుకున్నాం. అందులో భాగమే ఈ గోదావరి తీరం వెంబడి 99 లక్షల మొక్కలతో హరిత హారం చేపట్టాం. గోదావరి బేసిన్ భవిష్యత్తు కోసం మేం వెచ్చిస్తున్న పెట్టుబడి. నది బావుంటే..మనమందరం బావుంటాం. అందుకే నదీ రక్షణకు మా వంతు కృషి చేస్తున్నాం” అని అన్నారు.
Also Read:ఐఫోన్ ఆర్డర్ చేస్తే నూనె బాటిల్ వచ్చింది!

