గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ హిట్ తర్వాత బాలకృష్ణ తన తదుపరి సినిమాలపై దృష్టి సారించాడు. 100వ సినిమాగా వచ్చిన శాతకర్ణితో బాలయ్య టాలీవుడ్ని షేక్ చేశాడు. అయితే బాలయ్య వందో సినిమా కృష్ణవంశీతో ఉంటుందని అంతా భావించారు. కానీ అనుకోకుండా క్రిష్ తెరమీదకు వచ్చి బాలయ్యతో వందో సినిమాను తెరకెక్కించి మంచి హిట్ కొట్టాడు. దీంతో బాలయ్య తర్వాతి సినిమా కృష్ణవంశీతోనే అంటూ వార్తలు వెలువడ్డాయి.
కానీ పూరితో పైసా వసూల్ అంటూ వస్తున్న బాలయ్య 102గా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో ‘రైతు’ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందా? అనే విషయంపై ఫిల్మ్ నగర్లో చర్చలు జరుగుతున్నాయి.

కృష్ణవంశీ కూడా ప్రస్తుతం ‘నక్షత్రం’ మూవీకి సంబంధించిన పనులను దాదాపు పూర్తి చేసేశాడు. దీంతో మళ్లీ రైతుకు పదునుపట్టేందుకు సిద్దమయ్యాడు. అయితే బాలయ్య నుంచి ఎలాంటి రెస్పాన్స్ రావడం లేదట. దీంతో బాలయ్య ఈ సినిమా చేస్తారా లేదా అనేది సందిగ్దంలో పడింది. దీంతో కృష్ణవంశీ బాలయ్యకు ప్రత్యామ్నాయంగా హీరోని వెతికే పనిలో పడ్డాడట. ఇది సమాజానికి ఎంతో ఉపయోగపడే కథ అనీ .. దీనిని తప్పకుండా తెరకెక్కించాలనే పట్టుదలతో ఉన్నాడట. మరి ఆ లక్కీ ఛాన్స్ కొట్టేసే హీరో ఎవరోనని ఇండస్ట్రీ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

