కృష్ణా బోర్డు భేటీలో చర్చించిన కీలక అంశాలు..

344
- Advertisement -

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జలాల వివాదం విషయంలో ఈరోజు హైదరాబాద్‌లోని జలసౌధలో ఇరు రాష్ట్రాల ఇరిగేషన్‌ అధికారులతో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం కృష్ణా నది యాజమాన్యం బోర్డు చైర్మన్ పరమేశం మీడియాతో మాట్లాడారు. ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తిలో కృష్ణా జలాలు వాడుకోవాలని సూచించినట్టు తెలిపారు. శ్రీశైలం నుంచి 50:50 నిష్పత్తిలో విద్యుదుత్పత్తికి రెండు రాష్ట్రాలు అంగీకరించాయని తెలిపారు. గతంలోనూ అదే నిష్పత్తి అమల్లో ఉండేదని తెలిపారు.

ఇక వరద సమయంలో ఉపయోగించిన జలాలకు సంబంధించిన అంశాలను కమిటీ పరిశీలిస్తోందని వివరించారు. తాగునీటి వినియోగాన్ని 20 శాతం లెక్కింపుపై జల సంఘానికి నివేదించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించినట్టు చెప్పారు. ఏపీలో గోదావరి నుంచి కృష్ణా బేసిన్ కు తరలించిన జలాల అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించామని పరమేశం పేర్కొన్నారు.

కృష్ణా బోర్డును ఏపీ రాజధానికి తరలించే అంశంలో కేంద్ర జలశక్తి శాఖదే తుది నిర్ణయం అని అన్నారు. కొత్త ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు డీపీఆర్ లు ఇవ్వాలని స్పష్టం చేశామని…. అనుమతులు తీసుకుని డీపీఆర్ లు ఇచ్చేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయని, అంతేగాకుండా, రెండో దశ టెలిమెట్రీని ప్రాధాన్యతాంశంగా పరిగణించి అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేశాయని వివరించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టే కొత్త ప్రాజెక్ట్ లను ఆపాలని ఇప్పటికే చెప్పామని కెఆర్ఎంబి చైర్మన్ పరమేశం వెల్లడించారు.

- Advertisement -