కుంతియాపై రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

247
Komatireddy Rajagopal Reddy
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీల్లో కాంగ్రెస్‌ పార్టీ తన మార్కు రాజకీయాన్నే ప్రదర్శించింది. ఎవరు ఎంతగా పట్టుబట్టినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా, స్థానిక పరిస్థితులు ఎలా ఉన్నా.. అధిష్టానం తాను అనుకున్న విధంగానే ఎన్నికల ‘సైన్యాన్ని’ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత పార్టీ నేతలపై నిప్పులు చెరిగారు. గాంధీభవన్‌లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే సరిపోదనీ.. ప్రజల్లో ఏ నాయకుడికి ఎంత ప్రాధాన్యముందో తెలుసుకోవాలని ఆ పార్టీ అధినాయకత్వానికి హితవు పలికారు.

Komatireddy Rajagopal Reddy

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన పీసీసీ కమిటీల నియామకాలపై రాజగోపాల్‌రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జి కుంతియాపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ పార్టీ కమిటీల నియామకంపై విరుచుకుపడ్డారు.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,బ్రోకర్లందరికీ కమిటీలో స్థానం కల్పించారని, గాంధీ భవన్‌లో ప్రెస్ మీట్లు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని విమర్శించారు.

‘‘తెలంగాణ’ కు కుంతియా శనిలా తయరయ్యాడు. నేను ఎవరికీ భయపడను, తలవంచను. పైరవీకారులకు టిక్కెట్లిస్తే కాంగ్రెస్ గెలవదు. కమిటీలో మమ్మల్ని ఎక్కడో కిందపడేశారు. వార్డు మెంబర్‌గా గెలవలేని వారికి కమిటీలో స్థానం కల్పించారు. తప్పుడు నిర్ణయాలతోనే కాంగ్రెస్ గత ఎన్నికల్లో ఓడిపోయింది. రెండున్నర సంవత్సరాలలో పార్టీ తమను వందసార్లు అవమానించింది, ప్రజల్లో బలంగా ఉన్న వారికి అన్యాయం జరిగింది.’ అని రాజగోపాల్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -